
మధిర/ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ద్వారా రైతుల భూముల వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలు, రికార్డుల్లోని లోపాలను సరిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించారు. మధిర మండలం తొండలగోపవరం, ఎర్రుపాలెం మండలం తాటిగూడెం గ్రామంలో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. గ్రామంలో పంట పొలాలలో గట్టు వెంబటి నడుచుకుంటూ వెళ్లి రీసర్వేను పరిశీలించి, రైతులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో భూ సర్వే పూర్తి చేసి, ప్రతి భూమికి డిజిటల్ మ్యాప్ తో కూడిన భూధార్ కార్డు జారీ చేస్తామన్నారు. సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మధిర తహసీల్దారు ఆర్ రాంబాబు, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.