Reading Time: 2 minutes

13 ఏళ్ల కల నెరవేరింది.. ఇషాన్ కిషన్ దెబ్బకు సౌత్ జోన్ ఖేల్ ఖతం: దులీప్ ట్రోఫీ విజేతగా ఈస్ట్ జోన్!  

Caption of Image.

చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ జట్టు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సౌత్ జోన్‌తో జరిగిన ఈ ఐదు రోజుల ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యం (First Innings Lead) ఆధారంగా ఈస్ట్ జోన్ 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దులీప్ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచింది.  

ఇషాన్ కిషన్ రికార్డు ఇన్నింగ్స్: 

ఈ విజయంలో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ప్రధాన సూత్రధారిగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ ఏకంగా 270 రన్స్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా కుమార్ కుషాగ్రా (101) శతకం సాధించడంతో ఈస్ట్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల స్కోరు సాధించింది. ఆ తర్వాత సౌత్ జోన్‌ను 336 పరుగులకే ఆలౌట్ చేసి ఏకంగా 372 రన్స్ తో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే దాడి.. ఖురైషీ మెయిడెన్ సెంచరీ: 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఈస్ట్ జోన్, చివరి రోజు 212/5 స్కోరు దగ్గర ఆటను ప్రారంభించింది. మహ్మద్ కౌనైన్ ఖురైషీ (116 నాటౌట్) తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో రెండో మ్యాచ్‌లోనే తొలి సెంచరీ సాధించి సత్తా చాటాడు. అనుకూల్ రాయ్ (64) తో కలిసి 7వ వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 388/7 దగ్గర ఉండగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పటికి ఈస్ట్ జోన్ మొత్తం ఆధిక్యం 760 పరుగులకు చేరింది.

సౌత్ జోన్ సెలక్షన్ లోపాలు.. సిరాజ్ ఒంటరి పోరాటం:

ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ శక్తివంచన లేకుండా శ్రమించినప్పటికీ, అతనికి ఇతర బౌలర్ల నుంచి తగిన సపోర్టు లభించలేదు. ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, సాయి కిషోర్ లాంటి సీనియర్ ఆటగాళ్లను పక్కనబెట్టి సౌత్ మేనేజ్‌మెంట్ చేసిన ఎంపికలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి.  

మహమ్మద్ షమీ 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్:

మరోవైపు ఈస్ట్ జోన్ బౌలర్, టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ఇది 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. తన మార్క్ స్పెల్స్‌తో షమీ జట్టు విజయానికి కీలక పునాది వేశాడు. పక్కా చాకచక్యంతో, సమయస్ఫూర్తితో జట్టును నడిపించిన ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఈస్ట్ జోన్ క్రికెటర్లు ఐదు రోజుల పాటు పూర్తి ఆధిపత్యం చెలాయించి ట్రోఫీని ముద్దాడారు.

కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ పర్ఫెక్ట్ ప్లానింగ్: 

మ్యాచు అనంతరం ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. మేము రెండు రోజులు బ్యాటింగ్ చేశాం.. ఇది తొలి ఇన్నింగ్స్ లీడ్ ద్వారా నిర్ణయమయ్యే మ్యాచ్ అని మాకు ముందే తెలుసు.. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి భారీ ఆధిక్యం సాధించడమే మా ప్రాథమిక లక్ష్యం.. ఆ ప్లాన్‌ను మా బౌలర్లు చక్కగా అమలు చేశారని వ్యాఖ్యానించాడు.

©️ VIL Media Pvt Ltd.