Reading Time: 2 minutes
Brics Summit Iran President Warns Us And Israel In Delhi

BRICS Summit: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు, ఆధిపత్య ధోరణికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోదని స్పష్టం చేశారు. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇరాన్ బలంగా నిలబడుతుందని తెలిపారు.

మతపెద్దలు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపార ప్రముఖులతో జరిగిన సమావేశంలో పజెష్కియాన్ పశ్చిమాసియా పరిస్థితులపై ఇరాన్ వైఖరిని వివరించారు. శాంతియుత సహజీవనానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. ఇరాన్ సమాజంలో విభేదాలను సృష్టించేందుకు విదేశీ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని అన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్‌పై నేరుగా విమర్శలు చేసిన పజెష్కియాన్.. బెదిరింపులు, ఒత్తిళ్లకు తాము భయపడబోమని పేర్కొన్నారు. తమపై ఒత్తిడి పెంచితే అందుకు తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ.. ఇరాన్‌పై దాడులు, సాధారణ ప్రజలపై జరుగుతున్న నష్టాన్ని ప్రస్తావించారు.

‘అమెరికా అదుపులేని అడవి గుర్రంలా’..

ఆసుపత్రులు, మౌలిక వసతులు, ప్రజల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకోవడం కంటే ఇరాన్ సైనికులను ఎదుర్కోవాలని పజెష్కియాన్ అన్నారు. సరఫరాల కొరతను సృష్టించడం ద్వారా ఇరాన్ ప్రజలను లొంగదీసుకోవచ్చని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయని.. కానీ ఇరాన్ ప్రజలు ఎప్పటికీ లొంగరని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న చర్యలను అదుపు లేని అడవి గుర్రంపై స్వారీ చేయడంతో పజెష్కియాన్ పోల్చారు. ఇలాంటి విధానం చివరకు విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరించారు. దేవుడు ఇరానీయులు, చైనీయులు, భారతీయులు, ఇతర ప్రజలను సృష్టించాడని.. అందరూ పరస్పరం కలిసి జీవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అణచివేతకు తలొగ్గకుండా బాధితులకు మద్దతు కొనసాగిస్తామని అన్నారు.

బ్రిక్స్‌పై భారత్‌కు ఇరాన్ ప్రశంసలు..

పజెష్కియాన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం ఆయన పర్యటనలో ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా భారత్ నాయకత్వంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రశంసలు కురిపించారు. భారత్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న గొప్ప దేశంగా చూస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ అత్యంత కీలకమైన సంస్థగా మారిందని, ప్రపంచ వ్యవహారాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్థవంతంగా నిర్వహించగలదనే నమ్మకం తమకు ఉందని అరాఘ్చీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పాటు కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నేత మీర్వైజ్ ఉమర్ ఫారూక్, పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, అమెరికా-ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కు కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సమయంలో భారత్‌తో దౌత్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరాన్ చూస్తుండటం కూడా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.