Reading Time: 2 minutes
Why Pakistan Is Still Not A Brics Member Despite 2023 Application

Pakistan: ఢిల్లీ వేదికగా బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్‌పింగ్‌తో సహా సభ్య దేశాధినేతలు భారత బాట పట్టారు. బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా ఇలా మొత్తం 11 సభ్యదేశాలు ఉన్న ఈ కూటమిలో చేరేందుకు దాయాది పాకిస్తాన్ తహతహలాడుతోంది. అయితే, భారత్ మాత్రం పాకిస్తాన్‌ను పక్కన పెడుతోంది.

కూటమిలో చేరేందుకు పాక్ తహతహ..

బ్రిక్స్ సభ్యత్వం కోసం 29 దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో పాకిస్తాన్ కూడా ఉంది. అయితే, ఈ కూటమిలో చేరడానికి ఆ దేశ ఆర్థిక పరిస్థితే కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశ జీడీపీ వృద్ధిరేటు 3.7గా నమోదైంది. తమ ఆర్థిక వనరులను వైవిధ్యపరచుకోవడానికి , ప్రపంచ బ్యాంక్ (World Bank) అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, బ్రిక్స్ మద్దతు ఉన్న ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్’లో 580 మిలియన్ డాలర్ల వాటాను పాకిస్థాన్ కొనుగోలు చేసిందని ‘నిక్కీ ఆసియా’ నివేదిక పేర్కొంది.

2023లోనే పాకిస్తాన్ అధికారిక దరఖాస్తు..

2023 నవంబర్‌లో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి బ్రిక్స్‌లో చేరేందుకు తమ దేశం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. బ్రిక్‌లోని చాలా సభ్యదేశాలతో పాక్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అప్పట్లో బ్రిక్స్‌ను ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహం’’గా అభవర్ణించారు. బ్రిక్స్‌లో చేరడం ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం, సమగ్ర బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించగలదని అన్నారు.

ఛీ పొమ్మంటున్న భారత్..

బ్రిక్స్‌లో చేరడానికి పాకిస్తాన్ చైనా, రష్యా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించింది. రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ సభ్యత్వానికి మద్దతు కూడగట్టేందుకు బ్రిక్స్ సభ్యదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

అయితే, బ్రిక్స్‌లో చేరడానికి అన్ని సభ్యదేశాల ఏకాభిప్రాయం అవసరం. ఏకాభిప్రాయ-ఆధారిత ప్రవేశ నిబంధనల ప్రకారం, అన్ని దేశాలు ఒప్పుకుంటేనే ఏదైనా కొత్త దేశం కూటమిలో సభ్యుడిగా చేరొచ్చు. ఈ నియమం ప్రకారం, భారత్ పాకిస్తాన్ చేరికను ఎప్పటికీ ఒప్పుకోదు. దీంతో పాకిస్తాన్ గేటు బయట నిలబడే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు, బ్రిక్స్‌లో భారత ప్రాధాన్యత చాలా పెరిగింది. బ్రిక్స్‌లోని సభ్యదేశాలతో భారత వాణిజ్యం గణనీయంగా పెరిగింది. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు 48.8 శాతం ప పెరిగి 64.3 బిలియన్ డాలర్ల నుంచి 95.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.