Reading Time: < 1 minute
Ap Weather Alert Heavy Rains Thunderstorms Strong Winds

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, మత్స్యకారులు, తీర ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.