Reading Time: 2 minutes
China Supports India Brics Summit Modi Xi Meeting

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారతదేశానికి చేరుకున్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా రాబోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో జరుగుతున్న 18వ బ్రిక్స్‌ సదస్సుకు చైనా మద్దతు ప్రకటించింది. భారత్ విజయవంతంగా బ్రిక్స్‌ సదస్సును నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెహాంగ్ తెలిపారు. బ్రిక్స్‌ కూటమితో అనుబంధం ఉన్న దేశాలతో సహకారానికి చైనా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సెప్టెంబర్ 12న కీలక ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ముందు చైనా నుంచి భారత్‌కు మద్దతుగా వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం చైనా రాయబారి షూ ఫెహాంగ్ మాట్లాడుతూ.. భారత్ నిర్వహిస్తున్న బ్రిక్స్‌ సదస్సు విజయవంతం కావాలని చైనా కోరుకుంటోందని తెలిపారు. బ్రిక్స్‌ కూటమిలోని దేశాలతో సహకారం, సమన్వయానికి బీజింగ్‌ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో గురువారం ప్రధాని మోడీ ‘ఎక్స్‌’లో ‘‘All set for BRICS 2026!’’ అంటూ పోస్టు చేశారు. బ్రిక్స్‌ సదస్సు జరగనున్న భారత్ మండపం కన్వెన్షన్‌ సెంటర్‌కు సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. దీనిని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్‌ రీషేర్‌ చేయడం కూడా చర్చనీయాంశమైంది.

మోడీ-జిన్‌పింగ్ భేటీపై అందరి దృష్టి

బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా మోడీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. భారత్-చైనా సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచడం వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు మృతి చెందారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో మోదీ-జిన్‌పింగ్‌ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఢిల్లీలో బ్రిక్స్‌ దేశాల నేతల సందడి

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో జరిగే 18వ బ్రిక్స్‌ సదస్సుకు బ్రిక్స్‌ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల నేతలు హాజరుకానున్నారు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని పెంచడం, వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలపై చర్చించడం ఈ సదస్సులో కీలకంగా ఉండనుంది.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసీ, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, యూఏఈ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్, వియత్నాం ప్రధాని లే మిన్ హంగ్ తదితర ప్రపంచ నేతలు సదస్సులో పాల్గొననున్నారు.

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన.. మోడీతో భేటీకి ముందు చైనా నుంచి భారత్‌ బ్రిక్స్‌ సదస్సు నిర్వహణకు బహిరంగ మద్దతు రావడం.. ఈసారి ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సమావేశానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.