
Land vs Flat: గ్రామాలను వదిలేసి పట్టణాల్లో స్థిరపడే ధోరణి ఇటీవల బాగా పెరిగిపోయింది. కొందరైతే గ్రామీణ ప్రాంతాల్లోని తమ తరతరాల ఆస్తిపాస్తులను కూడా అమ్మేసి, ఆ డబ్బుతో నగరాల్లో ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అసలు నగరాల్లో ఆస్తుల విలువ పెరుగుతుందా లేక పక్కవారిని చూసి గుడ్డిగా గ్రామంలోని పొదుపు మొత్తాన్ని తెచ్చి పట్టణాల్లో పెడుతున్నారా అనే సందేహం చాలామందికి వస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి రాము, రవి అనే ఇద్దరు సోదరుల ఉదాహరణను చూద్దాం. తండ్రి నుంచి వారసత్వంగా ఇద్దరికీ చెరో రూ.10 లక్షలు వచ్చాయి. రాము తన డబ్బుతో గ్రామంలో భూమిని కొనగా, రవి పట్టణంలో చదువుకోవడం వల్ల గ్రామంలో ఆస్తి కొనడం ఇష్టం లేక నగరంలో ఒక చిన్న ఫ్లాట్ కొన్నాడు. దీర్ఘకాలంలో అంటే ఒక 20 ఏళ్ల తర్వాత వీరిద్దరిలో ఎవరు ఎక్కువ లాభపడతారు, ఎవరి వద్ద ఎక్కువ సంపద ఉంటుందో పరిశీలిద్దాం.
రాము గ్రామంలో రూ.10 లక్షలతో భూమి కొనడానికి ఒక బలమైన కారణం ఉంది. ల్యాండ్ అనేది ఎప్పటికీ పాతబడిపోదు, 20 ఏళ్ల తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. ఫ్లాట్ లాగా దీనికి గోడలు బలహీనపడటం లేదా కప్పు కారడం వంటి సమస్యలు ఉండవు సరే కదా, ఏటికేడూ దీని విలువ పెరుగుతూనే ఉంటుంది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో నేడు నగరానికి దూరంగా ఉన్న గ్రామం వైపు 20 ఏళ్లలో ఏదైనా నేషనల్ హైవే, ఎక్స్ప్రెస్ వే లేదా పెద్ద ఫ్యాక్టరీ రావచ్చు. అదే కనుక జరిగితే ఆ రూ.10 లక్షల భూమి విలువ ఏకంగా కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. పైగా ఈ ఖాళీ స్థలాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి నిర్వహణ ఖర్చులు ఉండవు. మరోవైపు నగరంలో ఫ్లాట్ కొన్న రవి ఆలోచన వేరేలా ఉంది. ప్రతి నెలా వచ్చే అద్దె డబ్బులు ఆదా అవుతాయని లేదా వేరొకరికి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుందని అతడు భావించాడు. నెలకు రూ.3,000 నుంచి రూ.4,000 అద్దె మిలుతుంది. ఏటా అది కొంత పెరిగినా కూడా 20 ఏళ్లలో కేవలం అద్దెల రూపంలోనే దాదాపు రూ.10 నుంచి రూ.12 లక్షలు సంపాదించవచ్చని రవి లెక్కవేశాడు. గ్రామంలోని భూమి నుంచి ప్రతి నెలా లేదా ప్రతి ఏటా ఇలాంటి పెద్ద ఆదాయమేమీ రాదని అతడి నమ్మకం.
అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఉంది. ఫ్లాట్కు నిర్దిష్టమైన ఆయుస్సు ఉంటుంది. కాబట్టి 20 ఏళ్ల తర్వాత అది పాతబడిపోతుంది. సాధారణంగా ప్రజలు పాత భవనాల్లో ఫ్లాట్లు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అందుకే ఖాళీ స్థలం పెరిగినంత వేగంగా ఫ్లాట్ విలువ పెరగదు. దీనికితోడు ఈ 20 ఏళ్ల కాలంలో ఫ్లాట్ రిపేర్లు, రంగులు వేయించడం, సొసైటీ మెయింటెనెన్స్ కోసం రవి గణనీయంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఇద్దరి ఆస్తుల లెక్కలు చూస్తే, గత రెండు దశాబ్దాలుగా పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే భూముల ధరలు అత్యంత వేగంగా పెరిగాయి. ఈ లెక్కన రాము కొన్న భూమి విలువ 20 ఏళ్లకు రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. కానీ రవి ఫ్లాట్ విలువ మాత్రం రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో రవికు అద్దెల ద్వారా రూ.10 నుంచి రూ.12 లక్షలు ఆదా అయినప్పటికీ అందులో రూ.2 నుంచి రూ.3 లక్షలు మెయింటెనెన్స్ కింద ఖర్చయిపోతాయి.
అంతిమంగా రవి ఫ్లాట్ మొత్తం విలువ రూ.45 లక్షల వద్ద ఆగిపోతే, రాము భూమి విలువ రూ.70 లక్షలను దాటిపోతుంది. అంటే రవి ఫ్లాట్ విలువతో పోలిస్తే రాము భూమి విలువ రెట్టింపు అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 20 ఏళ్ల తర్వాత రవి కంటే రాము ఎక్కువ ధనవంతుడయ్యే అవకాశాలు 90 శాతానికి పైగా ఉన్నాయి. నగరంలోని ఫ్లాట్లో కాలక్రమేణా పాతబడి విలువ తగ్గే భవనం కోసం మీరు డబ్బు చెల్లిస్తుంటే, గ్రామంలోని భూమి విలువ మాత్రం కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. రవి తనకు అద్దె ద్వారా వచ్చిన డబ్బును ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినా కూడా దాదాపు రూ.30 లక్షల వరకు సమకూరవచ్చు. కానీ ఈ మొత్తాన్ని కలిపినా సరే 20 ఏళ్ల తర్వాత రాము భూమి విలువను రవి అందుకోలేడు. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడి రూపంలో 20 ఏళ్ల కోసం పందెం వేయాలనుకుంటే ఫ్లాట్ కంటే ఖాళీ భూమి ఎల్లప్పుడూ మెరుగైన, ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అయితే.. ఇక్కడ అసలైన చిక్కు ఉంటుంది. గ్రామంలో భూమి అయినా.. నగరంలో ఫ్లాట్ అయినా ఆయా లోకేషన్లను బట్టి పెరుగుదల ఉంటుంది. ఒకవేళ ఎలాంటి అభివృద్ధి లేని సరైన రవాణా సౌకర్యం లేని గ్రామంలో రాము భూమి కొంటే ఎలాంటి పెరుగుదల ఉండకపోవచ్చు.