
PM Modi: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భారతదేశానికి వచ్చారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత అత్యంత కీలకమని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒప్పందాలను, అవగాహనను ఇరు పక్షాలు పాటించాలని సూచించారు. ద్వైపాక్షిక సంబంధాలు , పెట్టుబడులు, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.
సమావేశం తర్వాత భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టులో టియాంజిన్లో మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత భారత్-చైనా సంబంధాల్లో చోటుచేసుకున్న పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారని చెప్పారు. పరస్పర గౌరవం. పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించినట్లు ఆయన వెల్లడించారు.
ఇదే సమయంలో, భారత్-చైనా మధ్య విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని మోడీ జిన్పింగ్కు స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత కొనసాగించడం ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి ప్రాథమిక ఆధారం అని ప్రధాని చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకుని, సహకరించుకోవాలని అన్నారు.
ఇదిలా ఉంటే, సాధారణ సంబంధాల నుంచి సరిహద్దు వివాదాన్ని వేరుగా చూడాలని చైనా వైఖరి. అయితే, భారత్ మాత్రం సరిహద్దుల్లో శాంతి, ప్రశాంత లేకుండా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సాధ్యం కాదని చెబుతోంది. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీ మధ్య ప్రత్యేక ప్రతినిదుల స్థాయి చర్చలు జరిగాయి. ఎల్ఏసీ వెంబడి శాంతి కొనసాగించాల్సిన అవసరాన్ని భారత్ నొక్కి చెప్పింది. 2003లో ఏర్పాటైన ఈ వ్యవస్థ ద్వారా 3,488 కిలోమీటర్ల సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.