Reading Time: 2 minutes
Pm Modi At Brics Summit 2026 Global South Must Become A Rule Shaper Not Rule Taker

PM Modi: 18వ బ్రిక్స్ సమావేశాలు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోడీ సదస్సుకు అధ్యక్షత వహిస్తూ, కీలక ప్రసంగం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ సౌత్‌కు అంతర్జాతీయ నిర్ణయాల్లో మరింత బలమైన స్వరం ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా బలహీనమైన, అభివృద్ధి చెందుతున్న దేశాలను ‘‘గ్లోబల్ సౌత్’’గా వ్యవహరిస్తారు. ఇతరులు రూపొందించే నిబంధనల్ని అనుసరించే ‘‘రూల్ టేకర్’’గా కాకుండా, నిబంధనలను రూపొందించే ‘‘రూల్ షేపర్’’గా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మార్పుకు నాయకత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు.

సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ సౌత్ ముందు వరసలో ఉన్నప్పటికీ, అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనక వరసలో ఉందని అన్నారు. బ్రిక్స్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు , ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. ప్రస్తుత పాలనా వ్యవస్థను ‘‘అధికార పిరమిడ్’’తో పోల్చారు. ఇందులో అధికారం, నిర్ణయాధికారం పైస్థాయిలో కొన్ని దేశాలు వద్ద కేంద్రీకృతమై ఉంటుందని, దిగువ స్థాయిలో ఉన్న దేశాలు ఆ నిర్ణయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని రూపొందించే అవకాశం మాత్రం వారికి రావడం లేదని వివరించారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమానమైన, ప్రభావవంతమైన భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని మోడీ తన ప్రసంగంలో చెప్పారు.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు బ్రిక్స్ సభ్యదేశాలతో పాటు బ్రిక్స్ అవుట్‌రీచ్ దేశాలు హాజరయ్యాయి. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ పెజెష్కియాన్ వంటి నేతలు హాజరయ్యారు. బ్రిక్స్ కేవలం ఆర్థిక సహకార వేదికగా కాకుండా, ప్రపంచ వ్యవస్థలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలకు బలమైన వేదిగాగా మారాలనే భారత వైఖరిని ప్రధాని మోడీ సభ్యదేశాధినేతల ముందు చెప్పారు.

10 అంశాలతో రోడ్‌మ్యాప్:

రాబోయే 20 ఏళ్ల కోసం కొత్త, ప్రతిష్టాత్మక కార్యాచరణ అవసరమని మోడీ అన్నారు. ఇందు కోసం ప్రాతినిధ్యం, స్పందనాత్మకత, నిబంధనల రూపకల్పన ఆధారంగా 10 అంశాలతో రోడ్‌మ్యాప్ ప్రతిపాదించారు. ఇందులో ఐక్యరాజ్యసమింతి భద్రతా మండలి(UNSC) సంస్కరణలను మోదీ ప్రస్తావించారు. భద్రతా మండలి సంస్కరణలను ఇకపై వాయిదా వేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రపంచ ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ హక్కులు, నాయకత్వ స్థానాలు, విధాన ప్రాధాన్యతలు ప్రస్తుత ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలని మోడీ అన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దేశాలకు ప్రపంచ నిర్ణయ ప్రక్రియలో కూడా తగిన పాత్ర ఉండాలని అన్నారు.