Reading Time: < 1 minute
Nmms Scholarship Telangana Students Apply Last Date 2026

NMMS Scholarship : ప్రతిభ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్’ (NMMS) పథకాన్ని అందిస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవడానికి ఆగస్టు 24వ తేదీయే చివరి గడువు అని అధికారులు స్పష్టం చేశారు.

ఏటా రూ. 12 వేల ఆర్థిక సాయం

ఈ పథకానికి ఎంపికైన అర్హులైన విద్యార్థులకు ప్రతి నెలా రూ. 1,000 చొప్పున సంవత్సరానికి మొత్తం రూ. 12,000 అందజేస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే వరకు, అంటే వరుసగా నాలుగేళ్ల పాటు మొత్తం రూ. 48,000 ఆర్థిక సాయంగా లభిస్తుంది.

అర్హతలు , ఎంపిక విధానం

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3.50 లక్షలకు మించకూడదు. విద్యా అర్హతల విషయానికొస్తే, విద్యార్థి 7వ తరగతిలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి, అయితే ఎస్సీ , ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు ఉంటే సరిపోతుంది. ప్రత్యేకంగా నిర్వహించే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఈ పరీక్షలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT), స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) అనే రెండు విభాగాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.

కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ స్కూళ్లు , ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. ఈ స్కాలర్‌షిప్ లబ్ధి కొనసాగాలంటే విద్యార్థులు తమ తదుపరి చదువును తప్పనిసరిగా ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యాసంస్థల్లోనే కొనసాగించాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నందున అర్హత గల విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.