Reading Time: < 1 minute
మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు

వర్షాలు పడట్లేదని 3 నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి దహనం చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్ లో మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగినా.. భార్య దూరంగా ఉండడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే మూడు నెలల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆంజనేయులు డెడ్ బాడీని స్వగ్రామం కోడోనిపల్లికి తీసుకొచ్చి అర్ధరాత్రి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

అయితే గ్రామంలో వర్షాలు కురవడం లేదని.. ఊరికి అరిష్టం ఏదో సొకిందన్న అనుమానాలు గ్రామస్థుల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఆంజనేయులు అంత్యక్రియలు సంప్రదాయం ప్రకారం జరగలేదని అందుకే గ్రామంలో ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయన్న మూఢనమ్మక భావనకు వచ్చారు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి దహనం చేస్తే వర్షాలు కురస్తాయని విశ్వాసానికి వచ్చారు. అనుకున్నట్లుగానే పూడ్చిన డెడ్ బాడీని జేసీబీ సహాయంతో వెలకితీసి.. కట్టెలపై పెట్రోల్ పోసి దహనం చేశారు.

అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. వర్షాలు కురవడం, ప్రకృతి పరిస్థితులకు మృతదేహానికి దహనసంస్కారాలకు సంబంధం ఏంటన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మూఢనమ్మకాలతో మూడు నెలల క్రితం పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి దహనం చేయడం ఆందోళన కలిగిస్తోంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.