
Rajasthan Royals Owner: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలో, ఒక భారీ బిజినెస్ డీల్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కుల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త బాస్ వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టీల్ దిగ్గజం, భారత సంతతి బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ కుటుంబం ఈ జట్టును కొనుగోలు చేసింది. సుమారు 1.65 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,660 కోట్లు) భారీ వ్యయంతో ఈ ఒప్పందం కుదిరింది.
ఒప్పందం వివరాలు ఇవే..
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ, వ్యాక్సిన్ కింగ్ అదర్ పూనావాలా నుంచి మిట్టల్ కుటుంబం ఈ జట్టులోని మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్లో 75% మెజారిటీ వాటాను మిట్టల్ కుటుంబం దక్కించుకుంది. ఇదే సమయంలో అదర్ పూనావాలా ఈ జట్టులో సుమారు 18% వాటాను తన వద్దే ఉంచుకోనున్నారు. మిగిలిన వాటా ఇతర ఇన్వెస్టర్ల వద్ద ఉంటుంది. మనోజ్ బాడ్లే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా గ్రూప్ నుంచి ఈ నియంత్రణ వాటాను కొనుగోలు చేసేందుకు బిసిసిఐ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంది. 2026 మూడవ త్రైమాసికం నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
సొంత గడ్డపై మమకారమే కారణం
ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ గురించి లక్ష్మీ మిట్టల్ స్పందిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. “నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్థాన్కు చెందినది, అందుకే నేను రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగం కావాలని కోరుకున్నాను. ఈ అద్భుతమైన జట్టు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం తర్వాత రాజస్థాన్ రాయల్స్ బోర్డులో కీలక మార్పులు జరగనున్నాయి. లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్ (కుమారుడు), వనిషా మిట్టల్-భాటియా (కుమార్తె), అదర్ పూనావాలా, మనోజ్ మిట్టల్ కొత్త సభ్యులుగా చేరబోతున్నారు.
స్టీల్ కింగ్ ప్రస్థానం..
రాజస్థాన్లోని సదుల్పూర్లో జన్మించిన లక్ష్మీ మిట్టల్, ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశపు 4వ అత్యంత ధనవంతుడు. ఆయన నికర ఆస్తి విలువ 28.4 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు సంస్థ ‘ఆర్సెలార్ మిట్టల్’ ద్వారా ఆయన తన సామ్రాజ్యాన్ని నిర్మించారు. 1995లో లండన్ వెళ్లిన ఆయన, ఇటీవలే యూకేను విడిచి దుబాయ్కు మారాలని నిర్ణయించుకోవడం గమనార్హం. మొదటి సీజన్ (2008) విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు స్టీల్ కింగ్ చేతుల్లోకి వెళ్లడంతో ఫ్రాంచైజీ మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.