
సోదాలు చట్ట విరుద్దమంటూ GST అధికారులను వ్యాపారులు నిర్భంధించిన సంఘటన చెన్నైలో వెలుగు చూసింది. సోదాలు చేసేందుకు వచ్చిన జీఎస్టీ అధికారులను వ్యాపారులు చుట్టుముట్టి బంధించారు. పోలీసు ఉన్నతాధికారుల జోక్యం చేసుకుంటేగానీ వారిని వదల్లేదు.చెన్నై పట్టణంలోని సౌకార్ పేట్ లో మింట్ స్ట్రీట్ లో ఓ స్టీల్ షాపులో సోదాలు చేసేందుకు వచ్చిన జీఎస్టీ అధికారులను 300 మంది వ్యాపారులు బంధించడం ఇప్పుడు చెన్నైలో చర్చనీయాంశమైంది.
ముగ్గురు అధికారులతో కూడిన జీఎస్టీ అధిరుల బృందం శుక్రవారం ( జూలై31) సాయంత్రం సౌకార్ పేట్ లోని మింట్ స్ట్రీట్ లోని స్టీల్ షాపులను తనిఖీలు చేసేందుకు వచ్చింది. ఇది గమనించిన వ్యాపారులు.. దాదాపు 300 మంది అక్కడికి చేరుకొని అధికారులను చుట్టుముట్టారు. ఓ షాపులో బంధించారు. తనిఖీలు చట్టవిరుద్దమని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
జీఎస్టీ ఆడిట్ చట్టవిరుద్ధమని వ్యాపారులు సోదాలను వ్యతిరేకించారు. కమిషనర్తో సహా సీనియర్ జీఎస్టీ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.పోలీసులు వచ్చినప్పటికీ వ్యాపారులు వెనక్కి తగ్గలేదు. దీంతోస్థానిక పోలీస్ ఉన్నతాధికారి సంఘటనా స్థలానికి వచ్చి వ్యాపారులకు నచ్చజెప్పి జీఎస్టీ అధికారులు విడిపించారు.
అయితే జీఎస్టీ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ తో ఆరుగురి వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.
వ్యాపారులు ప్రధానంగా జీఎస్టీ భారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ పెనాల్టీలు, వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు, నిర్వహణ ఖర్చులపై చిన్న వ్యాపారులకు తీరని నష్టం అని అంటున్నారు. చిన్నచిన్న తప్పులు, టెక్నికల్ లోపాలు, కస్టమర్లనుంచి డబ్బులు అందకపోయిన, గడువులోపు పన్నులు చెల్లించాల్సి రావడం, పన్ను రిటర్లు దాఖలు చేయడానికి ప్రతిసారీ కన్సల్టెంట్లపై ఆధారపడాల్సి వస్తోందని చిన్న వర్తకులు వాపోతున్నారు.