
తెలంగాణ సినిమా థియేటర్ల వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారనీ తెలుస్తోంది. రెంటల్ విధానం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని, దాని స్థానంలో పర్సంటేజీ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మే 1 నుంచి థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా మల్టీప్లెక్స్ల తాకిడి, ఓటీటీల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ సింగిల్ స్క్రీన్లు రెంటల్’ లేదా ‘ఫిక్స్డ్ అమౌంట్’ ప్రాతిపదికన నడుస్తున్నాయి. అంటే సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా థియేటర్ యజమాని డిస్ట్రిబ్యూటర్లకు ఒక నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే, థియేటర్ యజమాని చెప్పిన అమౌంట్ కట్టేసినా కలెక్షన్స్ లేక సొంత జేబు నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అయితే మల్టీప్లెక్స్లలో ‘పర్సంటేజీ’ (షేర్) విధానం అమలవుతోంది. అంటే వచ్చిన వసూళ్లలో థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ ఒక ఒప్పందం ప్రకారం వాటాలను పంచుకుంటారు. ఇదే విధానాన్ని సింగిల్ స్క్రీన్లలోనూ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. పర్సంటేజీ విధానంతో పాటు సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదు అనేలా ఓటీటీ విండో విధిస్తే అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని వారు భావిస్తున్నారు. అలానే టికెట్ ధరల నియంత్రణ, విద్యుత్ ఛార్జీలపై సబ్సిడీ సహా పన్నుల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఈ నెల (ఏప్రిల్) 30 లోగా దీనిపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే, మే 1 నుంచి తెలంగాణలోని సుమారు 450కి పైగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ హెచ్చరించింది. వేసవి సెలవుల సమయంలో పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ‘బంద్’ నిర్ణయం చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్ అనే చెప్పాలి.