
Sangareddy: ఈ మధ్య చిన్న కారణానికే హింసాత్మక చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఓ కర్రీ పాయింట్లో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. రూ.10కి సాంబార్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి తల్వార్తో దాడికి దిగిన సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటనకు సంబంధించి అందిన వివరాల ప్రకారం.. కర్రీ పాయింట్లో పనిచేస్తున్న ఉదయ్ అనే యువకుడిని జీవన్ అనే వ్యక్తి రూ.10కి సాంబార్ ఇవ్వమని అడిగాడు. అయితే అక్కడ సాంబార్ ప్యాకెట్ ధర రూ.30 ఉండటంతో, రూ.10కి ఇవ్వడం సాధ్యం కాదని ఉదయ్ చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన జీవన్, అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో తీవ్రంగా స్పందించాడు.
మొదట గొడవ పడి వెళ్లిన జీవన్ కొద్దిసేపటికి తల్వార్తో తిరిగి వచ్చి షాప్ షట్టర్ మూసివేసి ఉదయ్పై దాడికి యత్నించాడు. ఈ సమయంలో అడ్డుకునేందుకు వచ్చిన క్యాషియర్పై కూడా దాడి చేయడంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం జీవన్ షట్టర్ తెరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.