Reading Time: 2 minutes
India Russia Oil Trade Friendship Amid Middle East War Crisis

India – Russia: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా చమురు సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. ఈ సంక్షోభం వల్ల ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో భారత్ చమురు దిగుమతులు 13% తగ్గాయి. అయితే, ఈ గడ్డు కాలంలో రష్యా భారత్‌కు అండగా నిలిచింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్, మార్చి నెలలో ప్రతిరోజూ 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా 61% పడిపోయి 11.8 లక్షల బ్యారెళ్లకు పరిమితమైంది. గత శనివారం నాడు హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారతీయ నౌకలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

READ ALSO: Ganja: గంజాయి మాయలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..

ఆదుకున్న రష్యా
మధ్యప్రాచ్యం నుంచి చమురు రాక తగ్గడంతో, భారత రిఫైనరీలు రష్యా వైపు మొగ్గు చూపాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రష్యా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. ప్రతిరోజూ సగటున 22.5 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురు భారత్‌కు చేరుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను నియంత్రించడానికి అమెరికా రష్యన్ చమురుపై ఆంక్షలను సడలించింది. ట్రంప్ ప్రభుత్వం ఈ సడలింపును మరో నెల రోజుల పాటు పొడిగించడం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ మినహాయింపు పొందిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇదే సమయంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి (OPEC) వాటా భారత దిగుమతుల్లో రికార్డు స్థాయిలో 29 శాతానికి పడిపోయింది. గతంలో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్, యూఏఈల నుంచి భారత్‌కు సరఫరా కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్చిలో భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో నిలవగా, సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు తగ్గడంతో భారత్ ఆఫ్రికా దేశాల నుంచి (ముఖ్యంగా అంగోలా) దిగుమతులు పెంచింది. ప్రస్తుతం అంగోలా మూడవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.

గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించిన భారత్, ఇప్పుడు యుద్ధం కారణంగా మారిన పరిస్థితుల్లో మళ్లీ రష్యానే నమ్ముకుంది. అమెరికా ఇచ్చిన వెసులుబాటుతో రాబోయే రోజుల్లో రష్యా నుంచి చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

READ ALSO: SRH vs DC: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!