Reading Time: 2 minutes
Justice Swarana Kanta Sharma Refuses Recusal Arvind Kejriwal Case Delhi High Court

Justice Swarana Kanta Sharma: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన ‘రీక్యూసల్’ (న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకోవాలని కోరడం) పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం ఘాటుగా స్పందించింది. తన నిష్పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వరన్ కాంత శర్మ తోసిపుచ్చారు. ఏ శక్తివంతమైన నాయకుడి ఒత్తిడికో, సోషల్ మీడియా పుకార్లకో లొంగి తన రాజ్యాంగ బాధ్యతల నుంచి వైదొలగబోనని ఆమె స్పష్టం చేశారు.

READ ALSO: KCR: బీఆర్‌ఎస్ జనరల్‌ సెక్రటరీగా జీవన్‌రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్‌

తీర్పులోని ముఖ్యాంశాలు..
తాను రాజ్యాంగంపై ప్రమాణం చేశానని, ఎలాంటి భయం లేదా పక్షపాతం లేకుండా న్యాయం చేయడమే తన బాధ్యత అని న్యాయమూర్తి పేర్కొన్నారు. బయటి ఒత్తిళ్లు లేదా రాజకీయ ప్రభావాలు తన నిర్ణయాన్ని మార్చలేవని ఆమె కచ్చితంగా చెప్పారు. కేసు విచారణకు ముందే న్యాయమూర్తి తన నిజాయితీని నిరూపించుకోవాలన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు కొట్టిపారేసింది. “మీరు నిజాయితీపరులని నిరూపించుకోవడానికి న్యాయమూర్తిని నిజాయితీ లేనివాడని ఆరోపించలేరు” అని జస్టిస్ శర్మ వ్యాఖ్యానించారు. కేవలం అనుమానాల ఆధారంగా న్యాయమూర్తి సమగ్రతను సవాలు చేయడం తగదని హితవు పలికారు.

న్యాయమూర్తి కుటుంబ సభ్యులు న్యాయ రంగంలో ఉన్నందున ఈ కేసు విచారించకూడదన్న వాదనపై ఆమె తీవ్రంగా స్పందించారు. “రాజకీయ నాయకుల వారసులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు లేని అభ్యంతరం, ఒక న్యాయమూర్తి బిడ్డ అదే వృత్తిలో ఉండటంలో ఎందుకు ఉంటుంది?” అని ప్రశ్నించారు. న్యాయమూర్తి పదవి చేపట్టినప్పుడు వారి కుటుంబ సభ్యులు తమ వృత్తిని వదులుకోవాలని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఎత్తుగడను న్యాయమూర్తి ‘క్యాచ్-22’ (ఇరువైపులా గెలిచే ప్రయత్నం)గా అభివర్ణించారు. “నేను తప్పుకుంటే ఆరోపణల్లో నిజం ఉందని అంటారు, తప్పుకోకుండా వ్యతిరేకంగా తీర్పు ఇస్తే పక్షపాతం అని అంటారు. నేను ఈ ఉచ్చులో పడను” అని ఆమె తేల్చి చెప్పారు. ఒక న్యాయమూర్తి గౌరవంపై దాడి చేయడం అంటే మొత్తం న్యాయవ్యవస్థపై దాడి చేయడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు భయపడి తాను వైదొలిగితే, రేపు ఏ శక్తివంతమైన నాయకుడైనా తమకు నచ్చని న్యాయమూర్తిని తొలగించే ప్రమాదకరమైన సంప్రదాయం మొదలవుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు లేదా రాజకీయ నాయకులు బహిరంగంగా చేసే వ్యాఖ్యలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయలేవని, వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వాస్తవమైన కారణం లేదా నిజమైన ప్రయోజనాల సంఘర్షణ ఉంటేనే విచారణ నుంచి తప్పుకుంటానని, కేవలం నిరాధారమైన ఆరోపణల కోసం తన బాధ్యతల నుంచి పారిపోనని జస్టిస్ స్వరన్ కాంత శర్మ స్పష్టం చేస్తూ విచారణను కొనసాగించనున్నట్లు తెలిపారు.

READ ALSO: Pakistan: పాకిస్థాన్‌కు చేజారిన రూ.12,500 కోట్ల డీల్.. సూడాన్ సంక్షోభంలో సౌదీ కీలక నిర్ణయం!