
RCB vs DC: ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓటమి పాలైంది. అయినప్పటికీ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే వేదికపై (చిన్నస్వామి స్టేడియం) 100 మ్యాచ్లు ఆడిన మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అయితే, ఈ మైలురాయి మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లకు ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది.
READ MORE: Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్ షాకిచ్చాడు. నిశ్శంక (1), కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2)లను పెవిలియన్ పంపి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ (57; 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అయితే కృనాల్ పాండ్యా బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. రాహుల్ అవుటైన తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (59 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయానికి చేరవ చేశాడు. అక్షర్ పటేల్ (26) మెరుపులు మెరిపించినా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది. చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన రసిక్ సలామ్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఢిల్లీపై ఒత్తిడి పెంచాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు కావాలి. ఈ సమయంలో మిల్లర్ ‘కిల్లర్’ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ పథంలో నడిపించాడు. రోమారియో షెపర్డ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతులకు కేవలం 2 పరుగులే వచ్చాయి. కానీ 3వ, 4వ బంతికి డేవిడ్ మిల్లర్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్ను మలుపు తిప్పాడు. 5వ బంతికి ఫోర్ కొట్టడంతో ఢిల్లీ ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది.