
టెక్నాలజీ విప్లవం పడగనీడలో సైబర్ నేరాలు సరికొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. కేవలం డబ్బులు కాజేయడమే కాకుండా.. నైతిక విలువలను పక్కనపెట్టి ఆన్లైన్ వేదికగా సాగుతున్న అశ్లీల దందా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పెద్ద నగరాల్లో కనిపించే ఇలాంటి వికృత ధోరణులు, ఇప్పుడు తెనాలి వంటి పట్టణాలకు సైతం పాకడం సమాజంలో మారుతున్న వికృత పోకడలకు నిదర్శనం. ముఖ్యంగా కుటుంబ సభ్యులే ఇలాంటి అనైతిక పనులకు ప్రోత్సాహం అందించడం మరింత దిగ్భ్రాంతికరం.
తెనాలిలో గుట్టురట్టు..
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పాండురంగపేటలో ఒక ఇల్లు కేంద్రంగా సాగుతున్న అశ్లీల చాటింగ్ వ్యవహారాన్ని త్రీ టౌన్ పోలీసులు గురువారం రాత్రి రట్టు చేశారు. ఈ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 44 ఏళ్లు, 54 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులతో ‘న్యూడ్ చాటింగ్’ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కీలక నిందితుడు సాయి..
ఈ మొత్తం వ్యవహారంలో ఒక మహిళ కుమారుడైన సాయి కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సాంకేతిక అంశాలను చక్కబెడుతూ.. కస్టమర్లను ఆకర్షించడం, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడంలో ఇతడు సహకరిస్తున్నాడు. పోలీసులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి, గత కొద్దిరోజులుగా రహస్యంగా విచారణ చేపట్టారు.
Also Read:SBI Bank: బ్యాంక్ ఖాతాదారులను ఇలా కూడా మోసం చేస్తుందా ఎస్బీఐ..? ఏం జరిగిందంటే..
న్యాయపరమైన చర్యలు..
జిల్లాలో ఈ తరహా అంశంపై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో లోతైన విశ్లేషణ కోసం వారు న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకున్నారు. చట్టపరంగా చూస్తే.. ఈ కేసులో పాల్గొన్న ఇద్దరు మహిళలను ‘బాధితులు’గా పరిగణించనున్నారు. అంటే వీరిని ప్రలోభపెట్టి లేదా ఇతర కారణాలతో ఈ రొంపిలోకి దింపినట్లు భావిస్తారు. కాగా.. ప్రధాన నిందితుడు సాయిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పరారీలో నిందితుడు..
ప్రస్తుతం నిందితుడు సాయి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతడు పట్టుబడితే.. ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు ఈ పోర్టల్ను ఎలా నిర్వహిస్తున్నారు? దీని ద్వారా ఎంతమంది బాధితులు మోసపోయారు? అనే కోణంలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సైబర్ వేదికగా సాగే ఇలాంటి నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.