Reading Time: 2 minutes
Business Air India Crisis Tata Sons Chairman Meets Singapore Airlines Ceo For Rescue Plan

Air India Crisis: భారత విమానయాన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఎయిర్ ఇండియా, ప్రస్తుతం ఊహించని సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రూ.22,000 కోట్ల భారీ నష్టం, సీఈఓ రాజీనామా, ప్రయాణికుల్లో తగ్గిన నమ్మకం వంటి పరిణామాల మధ్య టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈఓ ‘గో చూన్ ఫోంగ్’ గురువారం బాంబే హౌస్‌లో భేటీ అయ్యారు. ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1% వాటా ఉన్న నేపథ్యంలో, సంస్థను గట్టెక్కించేందుకు ఒక భారీ ‘రెస్క్యూ ప్లాన్’కు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

READ ALSO: Rahul Gandhi: రాహుల్ గాంధీకు బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్..

2026 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా ఏకంగా రూ.22,000 కోట్ల ($2.2 బిలియన్ డాలర్లు) రికార్డు నష్టాన్ని చవిచూసింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల గగనతలం మూసివేత, పాకిస్థాన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటివి ఈ నష్టాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోటర్ల నుంచి భారీ పెట్టుబడులు వస్తేనే సంస్థ మనుగడ సాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అప్పుడే చెదిరిన నమ్మకం
జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో జరిగిన AI 171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్) ప్రమాదం ఎయిర్ ఇండియా ప్రతిష్టను మసకబార్చింది. 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటన తర్వాత ప్రయాణికులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఇది నేరుగా సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థ కష్టాల్లో ఉన్న సమయంలోనే సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ ఏప్రిల్ 7, 2026న తన పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు ఆయన కొనసాగుతున్నప్పటికీ, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చితి నెలకొంది. తాజా భేటీలో కొత్త సీఈఓ అన్వేషణ, సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుంచి సాంకేతిక, నిర్వహణ మద్దతు తీసుకోవడంపై చర్చలు జరిగినట్లు సమాచారం. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జరిగిన ఈ చర్చల ద్వారా ఖర్చుల తగ్గింపు, సేవల మెరుగుదల, వ్యూహాత్మక మార్పులపై టాటా గ్రూప్ దృష్టి సారించనుందని సమాచారం. ఈ ‘రెస్క్యూ ప్లాన్ ‘ ఎయిర్ ఇండియాకు పునర్జీవం పోస్తుందో లేదో వేచి చూడాలి.

READ ALSO: Google Gemini AI: నీట్ విద్యార్థులకు గూగుల్ ‘ఏఐ’ వరం.. “ఒకే క్లిక్‌తో జెమిని యాప్‌తో ఉచితంగా నీట్ ప్రాక్టీస్ టెస్టులు!”