Reading Time: < 1 minute
Rajya Sabha Deputy Chairman Election India Alliance Boycott

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి నేతలు తీవ్ర వ్యతిరేకతన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని భారత కూటమి పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.

ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. అయితే తిరిగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక హరివంశ్ ఏప్రిల్ 10న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఏప్రిల్ 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక చేపట్టనున్నారు. అయితే డిప్యూటీ ఛైర్మన్ రేసులో మళ్లీ హరివంశ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. తిరిగి ఆయన్నే ఎన్నుకుంటారా? లేదంటే మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇదిలా ఉంటే 2019 నుంచి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. కానీ ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతుండడంతో కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ నియామకాన్ని ప్రభుత్వం బలవంతంగా చేయించాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.