
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట సమీపంలోని హైదరాబాద్ – ఖమ్మం రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం అర్బన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, డీసీసీ సభ్యులు జావీద్ మృతి చెందారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో జావీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో జావీద్ పదవీ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది.
పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి త్వరలోనే కార్పొరేషన్ పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించిన మరుసటి రోజే ఈ విషాదం చోటుచేసుకోవడం కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జావీద్ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు.