
సూపర్స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. లేటెస్ట్ గా ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక ఆసక్తికర వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి ‘దేవర’ టెక్నాలజీని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ రేంజ్ యాక్షన్!
జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రం ‘దేవర’ కోసం శంషాబాద్ సమీపంలో అత్యాధునిక సాంకేతికతతో భారీ వాటర్ ట్యాంక్ సెట్ను, బ్లూ మ్యాట్ (Blue Matte) బ్యాక్డ్రాప్ను నిర్మించిన సంగతి తెలిసిందే. సముద్రపు అలల సహజత్వాన్ని ప్రతిబింబించేలా బ్లూ మ్యాట్ టెక్నాలజీతో నిర్మించిన ఈ సెట్ను, ఇప్పుడు రాజమౌళి తన సినిమా కోసం రీ-డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘వారణాసి’లోని గంగా నది నేపథ్యంలో వచ్చే అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసం రాజమౌళి ఇదే సెట్ను ఎంచుకున్నారని టాక్. నిజానికి ఈ షెడ్యూల్ విదేశాల్లో జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం పశ్చిమ ఆసియా లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, చిత్ర యూనిట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి తన ప్లాన్ మార్చారు. విదేశీ ప్రయాణాల రిస్క్ తీసుకోకుండా, మన హైదరాబాద్లోనే గంగా నది పరివాహక ప్రాంతాన్ని తలపించేలా సెట్ను రీ-డిజైన్ చేయించి షూటింగ్ కొనసాగిస్తున్నారు.
మహేష్ బాబు ద్విపాత్రాభినయం?
ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర, రాముడు అనే రెండు విభిన్న పాత్రల్లో (ద్విపాత్రాభినయం) కనిపిస్తారని సమాచారం. గంగా నదిలో శత్రువులతో పడవపై సాగే హై-వోల్టేజ్ చేజ్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం. టైమ్ ట్రావెల్ మరియు పురాణాల మేళవింపుతో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో అలరించనున్నారు.
ఈ మూవీలో మందాకిని పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్, మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ‘దేవర’లో వాడిన అడ్వాన్స్డ్ అండర్ వాటర్ సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ఇక్కడ మరెంత గొప్పగా ఉండబోతున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
లీకుల కలకలం…
ఈ భారీ షెడ్యూల్ జరుగుతుండగానే, షూటింగ్కు సంబంధించిన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతోంది. గతం లోనూ ఇలాగే కొన్ని విజువల్స్ బయటకు రావడంతో మహేష్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రం విషయంలో చిత్ర యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
టైమ్ ట్రావెల్, అడ్వెంచరస్ ఎలిమెంట్స్తో కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. విజువల్ వండర్గా రాబోతున్న ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయం ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.