Reading Time: 2 minutes
Vijay Opposes Delimitation Bill 2026 Tamil Nadu Representation Concerns

రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అయితే డీలిమిటేషన్ బిల్లుపై మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ‘‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026’’ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యలో పెద్ద మార్పు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లుపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది.

తాజాగా ఇదే అంశంపై టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక ప్రకటన విడుదల చేశారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదనలు పక్షపాత చర్యగా అభివర్ణించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తమిళగ వెట్రి కళగం (TVK) స్వాగతిస్తోందని.. కానీ ఈ సవరణ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణ-ఉత్తర రాష్ట్రాల మధ్య ప్రతినిధిత్వ అసమానత మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సవరణ బిల్లుతో దక్షిణ రాష్ట్రాల్లో ప్రతినిధిత్వం తగ్గిపోతుందని.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభావం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భాష, సంస్కృతి, రాష్ట్ర హక్కులు, కేంద్ర విధానాల రూపకల్పనలో దక్షిణ రాష్ట్రాల స్వరం బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఘోరంగా దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. బిల్లు ఆమోదం పొందితే కేంద్ర విధానాలను అనుసరించే రాష్ట్రాలకు ఇది ‘‘శిక్ష’’గా ఉంటుందన్నారు. అనుసరించని రాష్ట్రాలకు మాత్రం ‘‘ప్రోత్సాహం’’గా మారుతుందని విమర్శించారు. అదే విధంగా పార్లమెంట్ నియోజకవర్గాల మార్పులు ఆర్థిక పంపిణీపై కూడా తీవ్ర ప్రభావం చూపవచ్చని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం కేంద్రం నుంచి అందే ఆర్థిక సాయం విషయంలో నష్టపోతుందని ఆరోపణలు ఉన్నాయని.. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా తగిన నిధులు, ప్రాజెక్టులు లభించడం లేదని చెప్పారు. డిలిమిటేషన్ తర్వాత జనాభా ఆధారిత పథకాల కింద రాష్ట్రానికి వచ్చే నిధులు మరింత తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026”ను ఉపసంహరించుకోవాలని.. ప్రస్తుత వ్యవస్థనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు.