
Uganda: ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు ఆర్మీ చీఫ్ అయిన ముహుజీ కైనెరుగాబా చేసిన డిమాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమకు 1 బిలియన్ డాలర్లు, మీ దేశంలోని అత్యంత అందమైన మహిళను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని టర్కీని డిమాండ్ చేశారు. ప్రాంతీయ భద్రతా ప్రయత్నాలకు ఉగాండా చేసిన కృషిని గుర్తించలేదని, దానికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉంతటుందని కైనెరుగాబా అన్నారు.
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, 30 రోజుల్లోగా టర్కీతో దౌత్య సంబంధాలను తెంచుకుంటామని, రాజధాని కంపాలోని వారి కార్యాలయాన్ని మూసేస్తామని ఆయన హెచ్చరించారు. టర్కీలోని అత్యంత అందమైన మహిళను తనకు అప్పగించాలని, ఆమెను పెళ్లి చేసుకుంటాన్ని చెబుతూ ఆ దేశాన్ని కోరడం వివాదాస్పదంగా మారింది. సోమాలియా రాజధాని మొగాదిషు లోని ఓడరేవులు, విమానాశ్రయాలు, అనేక ప్రాజెక్టుల నుంచి టర్కీ లబ్ధి పొందుతోందని కైనెరుగాబా ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల నుండి టర్కీ లాభాలు ఆర్జిస్తుండగా, ఉగాండా చాలా సంవత్సరాలుగా భారీ భద్రతా బాధ్యతను మోస్తోందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Shivraj Singh Chouhan: బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ సీఎం ఎవరో తేల్చేయనున్నది ఈయనే!
ఉగాండా గత రెండు దశాబ్ధాలుగా ఆఫ్రికన్ యూనియన్ మిషన్లలో భాగంగా సోమాలియలో సైనిక దళాలను మోహరించి, ప్రధానంగా అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థతో పోరాడటానికి ఈ దళాలను పంపింది. టర్కీ నుంచి ఉగాండాకు భద్రతా డివిడెంట్గా 1 బిలియన్ డాలర్లు అందాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో కైనెరుగాబా ఇజ్రాయిల్కు మద్దతు తెలిపారు. పవిత్ర భూమిని, మన దేవుడైన యేసు క్రీస్తు భూమిని రక్షించడానికి నా ఆధ్వర్యంలో లక్ష మంది ఉగాండా సైనికులను ఇజ్రాయిల్కు పంపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కైనెరుగాబా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గురించి మాట్లాడుతూ.. ఇటలీ ప్రధానిని వివాహం చేసుకోవడానికి, బదులుగా తనకు భూమిపై అత్యంత అందమైన ఆవులుగా అభివర్ణించిన 100 అంకోలే ఆవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన బహిరంగంగా ప్రకటించారు.