
Asha Bhosle: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో ఏడు దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. “యే మేరా దిల్..”, “పియా తు అబ్ తో ఆజా..” వంటి వేలకొద్దీ ఆల్టైమ్ హిట్ పాటలకు ప్రాణం పోసిన ఆశా భోస్లే మరణం సంగీత పరిశ్రమకు తీరని లోటు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా, కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. ముఖ్యంగా 50, 60, 70వ దశకాల్లో బాలీవుడ్ సంగీతానికి వెస్ట్రన్ టచ్ ఇస్తూ ఆమె పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి.
READ ALSO: Uganda: “మీ దేశంలో అందమైన మహిళను నాకు ఇవ్వండి”.. ఉగాండా ఆర్మీ చీఫ్ షాకింగ్ డిమాండ్..
అక్క కంటే తక్కువ పారితోషికం.. కానీ
సంగీత స్వర్ణయుగంలో లతా మంగేష్కర్ అగ్రగామిగా ఉన్న సమయంలో ఆశా భోస్లే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. తొలినాళ్లలో లతా మంగేష్కర్కు ఒక పాటకు రూ.500 చెల్లించేవారు. అయితే ఆశా భోస్లే కేవలం రూ.100 నుంచి రూ.150 (లతాజీ పారితోషికంలో దాదాపు 20%) మాత్రమే తీసుకునేవారు. లతాజీ ఎక్కువగా మెలోడీ, మెయిన్ స్ట్రీమ్ పాటలు పాడితే.. ఆశా భోస్లే ప్రయోగాత్మక పాటలు, ఐటమ్ నంబర్లను తనదైన శైలిలో పాడి మెప్పించారు. ఆ ‘స్పెషలైజేషన్’ ఆమెను సంగీత ప్రపంచంలో అజేయురాలిగా నిలబెట్టింది.
ఆశా భోస్లే ఆస్తుల విలువ ఎంతంటే..
ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు, తెలివైన వ్యాపారవేత్త కూడా. అందుకే ఆమె దేశంలోనే టాప్ 10 అత్యంత ధనిక మహిళా గాయనుల్లో ఒకరిగా నిలిచారు. పలు నివేదికల ప్రకారం.. ఆమె నికర ఆస్తి విలువ సుమారు రూ.100 కోట్ల అని అంచనా. ఆశా భోస్లేకు దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, యూకే వంటి దేశాలలో సొంతంగా రెస్టారెంట్ చైన్ (Asha’s) ఉంది. భారతీయ వంటకాలకు ఈ రెస్టారెంట్లు విదేశాల్లో బాగా ప్రసిద్ధి చెందాయి. అలాగే ముంబైలోని పెడ్డర్ రోడ్లో ఉన్న ‘ప్రభు కుంజ్’ అపార్ట్మెంట్తో పాటు ముంబై, పూణేలలో ఆమెకు విలువైన ఆస్తులు కూడా ఉన్నాయని ఈ నివేదికలు చెబుతున్నాయి. డబ్బు, ఆస్తుల కంటే ఆమె సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఆమె గాత్రం. వివిధ భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆమె మరణవార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.