Reading Time: 2 minutes
అయ్యో.. ఎంత పని చేశావ్‌ అక్షంత్..! ఒక్క రోజు ఓపిక పట్టి ఉంటే..

ఖమ్మం, ఏప్రిల్ 12: ఇంటర్‌ పరీక్షల్లో పాస్‌ అవుతానో లేదోనన్న భయంలో ఓ విద్యార్ధి నిండు ప్రాణం తీసుకున్నాడు. గురువార రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రాపల్లి గ్రామానికి చెందిన గంగాదేవుల అక్షంత్ అనే విద్యార్థి ఇంటర్ MPC ఫస్ట్ ఇయర్‌ చదువుతున్నాడు. అయితే పరీక్షలు రాసినప్పటి నుంచి పాస్‌ అవ్వనేమోనన్న భయంతో రోజూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఫెయిల్ అవుతాననే భయంతో మనస్తాపం చెందిన అక్షంత్‌ గురువారం (ఏప్రిల్ 9) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కానీ ఈ రోజు వచ్చిన ఫలితాల్లో అక్షంత్ పేరును చూసి అంతా ఆశ్చర్యపోయారు. అతడు భయపడినట్లు కాకుండా అన్ని సబ్జెక్టుల్లో పాస్‌ అయ్యాడు. మొత్తం 347 మార్కులతో ఫస్ట్‌ కాస్‌లో ఉత్తీర్ణత పొందాడు. మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి కఠినమైన సబ్జెక్టుల్లోనూ అధిక మార్కులు సాధించాడు. దీంతో ఫలితాలు చూశాక తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మూడు రోజులు ఓపిక పట్టి ఉంటే అక్షంత్ బతికి ఉండేవాడని గుండెలవిసేలా రోధించారు. కాగా రాష్ట్రంలో 9.97 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తే మొదటి సంవత్సరంలో 66.94శాతం మంది, రెండో సంవత్సరంలో 75.61 శాతం మంది పాస్‌ అయ్యారు. ఈ ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదలకావల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ రోజు విడుదల చేశారు.

Inter Student Akshinh

మిత్రమా..! పరీక్షలు, అందులో వచ్చే మార్కులు మాత్రమే భవిష్యత్‌ను నిర్ణయించవు. ఒకవేళ ఫెయిలైతే సప్లిమెంటరీ పరీక్షలు రాసి మళ్లీ పాస్‌ అవ్వొచ్చు. అసలు చదువే ఇష్టం లేకపోతే వేరే వృత్తిలో స్థిరపడవచ్చు. మన చుట్టూ ఉన్న ఎందరో కనీసం 5వ తరగతి కూడా చదవకపోయినా వ్యాపారం, కళలు వంటి అభిరుచి ఉన్న రంగాల్లో రానిస్తున్నారు. అంతేగానీ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వల్ల కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చినవారే అవుతావు. కొంచెం ఆలోచించు నేస్తం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.