Reading Time: 1 minute

రుతుపవనాలపై ‘ఎల్ నినో’ పంజా! దేశానికి పొంచి ఉన్న కరవు ముప్పు

Caption of Image.
  • రుతుపవనాలపై ‘ఎల్ నినో’ పంజా!
  • అధికారికంగా ప్రారంభమైనట్లు ఐఎమ్‌‌‌‌‌‌‌‌‌‌డీ ప్రకటన
  •   జూలై నుంచి మరింత ముదిరే చాన్స్
  •     దేశానికి పొంచి ఉన్న కరవు ముప్పు 

దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడుతున్నాయని  భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుత రుతుపవ నాల సీజన్‌‌‌‌లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు అధికారికంగా ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌‌‌‌‌‌‌‌డీ) హెచ్చరించింది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 2026కు సంబంధించిన ఎన్సో, ఇండియన్ ఓషన్ డైపోల్ బులెటిన్‌‌‌‌‌‌‌‌లో వాతావరణ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. సాధారణంగా ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో రుతుపవనాలు బలహీనపడటం, ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కరవు ముప్పు పొంచి ఉంటుంది.

వేడెక్కుతున్న పసిఫిక్ సముద్రం..

తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్ నినో స్థాయికి చేరినట్లు ఐఎమ్‌‌‌‌‌‌‌‌డీ స్పష్టం చేసింది. సముద్రంతోపాటు వాతావరణ వ్యవస్థ కూడా ఇందుకు అనుకూలంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్ ముందుకు సాగే కొద్దీ ఎల్ నినో మరింత తీవ్రం కావచ్చని ‘మాన్‌‌‌‌‌‌‌‌సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌‌‌‌‌‌‌‌కాస్ట్ సిస్టమ్’ నమూనాలు సూచిస్తున్నాయి. ఈ దృగ్విషయాన్ని పర్యవేక్షించే ‘నినో 3.4 ఇండెక్స్’ ఇప్పటికే +0.5 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పసిఫిక్ సముద్ర గర్భంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాబోయే నెలల్లో ఎల్ నినో మరింత బలపడక తప్పదని తెలుస్తోంది. జూలై నుంచి దీని తీవ్రత మధ్యస్థం నుంచి బలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

జపాన్ వాతావరణ సంస్థ అంచనా..

జూన్ 11న ఎల్ నినో రాకను ధృవీకరించిన జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) ఒక ఆశాజనకమైన విషయాన్ని వెల్లడించింది. జూలై నాటికి హిందూ మహాసముద్రంలో ‘సానుకూల పరిస్థితులు’ ఏర్పడే అవకాశం ఉందని, అదే గనుక జరిగితే ‘సూపర్ ఎల్ నినో’ వల్ల దేశానికి కలిగే నష్టాన్ని ఇది కొంతవరకు భర్తీ చేయగలదని జపాన్ వాతావరణ సంస్థ అభిప్రాయపడింది.

 

©️ VIL Media Pvt Ltd.