Reading Time: 2 minutes
ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు జయసుధ. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన జయసుధ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు జయసుధ. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానం, తోటి నటీనటులతో అనుబంధం, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల వ్యక్తిత్వాలపై పలు అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాకుండా, పద్మ పురస్కారాల గురించి పంచుకున్నారు. చిరంజీవి గారి సినీ ప్రస్థానం గురించి జయసుధ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన జర్నీ చాలా కఠినమైనదని, పెద్ద హీరోలు నలుగురు, ఐదుగురు ఉన్న సమయంలో కొత్తగా వచ్చి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారని తెలిపారు. చిరంజీవి గారి క్రమశిక్షణ, అచీవ్ చేయాలనే సంకల్పం, ఆధ్యాత్మికత వంటివి ఆయన విజయానికి కారణమని వివరించారు. ఆయనది చాలా కఠినమైన ప్రయాణం, అని ఆమె పేర్కొన్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, ఆయన తండ్రిలాగే వినయంగా, క్రమశిక్షణతో ఉంటారని జయసుధ ప్రశంసించారు. షూటింగ్ సెట్‌కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మాట్లాడాలనే సంస్కారం ఆయనలో ఉందని తెలిపారు. మెగాస్టార్ కుటుంబం మొత్తం వినయంగా ఉంటుందని, వారెప్పుడూ తమను తాము మెగాస్టార్ పిల్లలుగా గొప్పగా చెప్పుకోరని, ప్రజలు మాత్రమే ఆ గుర్తింపు ఇస్తారని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ తో తాను బాలు సినిమాలో నటించినా, ఆయన ఎక్కువ మాట్లాడరని తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబును తాను చిన్నప్పటి నుంచీ చూస్తున్నానని జయసుధ వెల్లడించారు. షూటింగ్‌లకు రావడం, బాల నటుడిగా నటించడం వంటి విషయాలను గుర్తు చేసుకున్నారు. మహేష్ ను కృష్ణ గారిలాగే తక్కువ మాట్లాడే, ప్రశాంతమైన వ్యక్తిగా వర్ణించారు. తాను మహేష్ తో మహర్షి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలలో నటించినట్లు పేర్కొన్నారు. మహేష్ తనను “జయసుధ గారు” అని పిలుస్తారని, తాను “మహేష్” అని పిలుస్తానని చెప్పారు. అయితే ఇండస్ట్రీలో తనకు రామ్ చరణ్ ఒక్కడే ఆంటీ అని పిలుస్తాడని జయసుధ తెలిపారు. మిగిలిన వారందరూ జయసుధగారు అనే పిలుస్తారని ఆమె తెలిపారు.

Ram Charan

Ram Charan

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి