
Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల లెక్కింపులో జరిగిన ఆర్థిక అక్రమాల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఉదంతంపై రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) ఒక యువకుడిని అదుపులోకి తీసుకోగా, మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఎస్ఓజీ పోలీసులు రుదౌలీ పరిధిలోని షుజాగంజ్ ప్రాంతానికి చెందిన లవ్ కుష్ మిశ్రా అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఇతని పాత్రపై ఆరా తీస్తున్నారు. అయితే దర్యాప్తు అధికారులకు షాక్ ఇస్తూ లవ్ కుష్ మిశ్రా ఇంట్లో తనిఖీ చేయగా.. ఏకంగా రూ.10 లక్షల కరెన్సీ నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఈ డబ్బులు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లోని పేడ (గోబర్) కుప్పలో దాచడం గమనార్హం.
రంగంలోకి సిట్ (SIT).. 15 రోజుల్లో ఫైనల్ రిపోర్ట్
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ సిట్ కమిటీ అధ్యక్షుడిగా లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఎన్నికయ్యారు. ఐపీఎస్ అధికారిణి కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ బృందం 7 రోజుల్లోగా ప్రాథమిక నివేదికను, 15 రోజుల్లోగా పూర్తిస్థాయి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. కేవలం అదుపులోకి తీసుకున్న యువకుడే కాకుండా, కానుకల లెక్కింపు విధుల్లో పాల్గొన్న పలువురు ఆలయ ఉద్యోగులు కూడా ప్రస్తుతం దర్యాప్తు సంస్థల నిఘా నీడలో ఉన్నారు. ఈ అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయనేది తెలుసుకోవడానికి ఆలయ ప్రాంగణంలోని, కౌంటింగ్ హాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే, రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ (రిటైర్డ్ ఐఏఎస్) నృపేంద్ర మిశ్రా శనివారం అయోధ్యకు చేరుకుని నిర్మాణ పనులను సమీక్షించారు. అయితే ఈ దొంగతనంపై స్పందించడానికి ఆయన నిరాకరిస్తూ.. తన బాధ్యత కేవలం ఆలయ నిర్మాణ పనుల పర్యవేక్షణకే పరిమితమని స్పష్టం చేశారు. మరోవైపు యూపీ క్యాబినెట్ మంత్రి సూర్య ప్రతాప్ షాహీ స్పందిస్తూ.. “భక్తుల నమ్మకం, ఆరాధనతో ఎవరినీ ఆటలాడబోనివ్వం. ట్రస్ట్ ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించింది, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి” అని పేర్కొన్నారు.