Reading Time: < 1 minute
Chiranjeevi Emotional Review On Ram Charan Peddi Movie Performance

Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ పండించిన భావోద్వేగాలు, ముఖ్యంగా సినిమాలోని ‘హాస్పిటల్ సీన్’ లో అతని నటన చూసి థియేటర్లలో ప్రేక్షకుల గుండెలు మెలిపెట్టేసినంత పనైందని, ఈ నటనకు జాతీయ అవార్డు వస్తే తనకు అంతకంటే మరో సంతోషం ఉండదని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తాజాగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పెద్ది సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

నిజమైన ‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది

ఈ సినిమా చూసిన తర్వాత ఐమాక్స్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్ గురించి బుచ్చిబాబు గుర్తుచేసుకున్నారు. “మేమంతా ఐమాక్స్‌లో సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లోని ఆడియన్స్ అందరూ సీట్లలోంచి లేచి.. ‘అన్నా.. నీకు నేషనల్ అవార్డ్ అన్నా’ అని చరణ్‌ను ఉద్దేశించి గట్టిగా అరిచారని చెప్పారు. దానికి మెగాస్టార్ స్పందిస్తూ.. ఒక తండ్రిగా, తోటి నటుడిగా చరణ్‌ను చూసి నేను గర్వపడుతున్నాను” అని అన్నారు. ఈ సందర్భంగా సుమతి శతకంలోని పద్యం గుర్తుచేసుకుంటూ.. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులు ఆ పుత్రుని గనుగొని పొగడగ పుట్టును” అనే మాటకు అర్థం తనకు ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసివచ్చిందని, ‘ఐ లవ్ యు చరణ్’ అంటూ కొడుకుపై ప్రేమను కురిపించారు.

ఈ సినిమాలో జగపతి బాబు పోషించిన ‘అప్పలసూర్యు’ పాత్ర డిజైనింగ్, ఆయన ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. జగపతి బాబు కళ్లు, వాయిస్ వింటే తప్ప ఆ పాత్ర చేసింది ఆయనే అని గుర్తుపట్టడం కష్టమని, అంతగా ఆ పాత్రలో వదిగిపోయారని చిరంజీవి కొనియాడారు. ‘అప్పలసూర్యు’ క్యారెక్టరే కథకు అసలైన ట్రిగ్గర్ పాయింట్ అని, ఆ పాత్ర జెండా పట్టుకుని ‘పెద్ది’ చేతిలో పెట్టాకే కథ నెక్స్ట్ లెవెల్‌కు ట్రావెల్ అవుతుందని దర్శకుడి విజన్‌ను అభినందించారు. క్లైమాక్స్ లో స్టేషన్ సీన్ కూడా అప్పలసూర్యుడి వల్లే కావడం ఆ పాత్రకు ఇచ్చిన ఒక అద్భుతమైన ట్రిబ్యూట్ అని చిరంజీవి విశ్లేషించారు. మొత్తానికి చరణ్ వన్-మ్యాన్ షోపై మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.