Reading Time: < 1 minute
మీనాక్షి వివాదంలో కొత్త కోణం.. కేసు లీక్ చేసింది ఎవరు? అసలు డ్యామేజ్ చేసింది ఎవరు?

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న దానికంటే, ప్రారంభ దశలోనే సరైన న్యాయపరమైన వాదనలు వినిపించకపోవడమే మీనాక్షికి ఎక్కువ నష్టం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో మీనాక్షి నటరాజన్‌కు కొంత ఊరట లభించినప్పటికీ, ఆమె తరఫున వ్యవహరించిన న్యాయవాదుల పాత్రపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఈ కేసులో బాధితురాలు 2025 సెప్టెంబర్‌లో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో మీనాక్షి నటరాజన్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్ దాఖలైన తర్వాత ప్రతివాదులందరికీ నోటీసులు జారీ కాగా, కొందరు తమ న్యాయవాదుల ద్వారా వివరణలు కూడా సమర్పించారు.

అయితే కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఇది ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశమని, సాధారణ కోర్టు పరిధిలోకి రాదని వాదన వినిపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది నెలల తర్వాత మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా, నాంపల్లి కోర్టు తనకు విచారణాధికారం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరిగి ఇచ్చింది. దీంతో ఫిర్యాదుదారు ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదే వాదనను ముందుగానే తీసుకొచ్చి ఉంటే కేసు ఈ స్థాయికి చేరుకునేది కాదని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు కేసు వివరాలు అఫిడవిట్‌లో పొందుపరచలేదనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు రిటర్నింగ్ అధికారిని ఆశ్రయించగా, మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు దారితీసిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో కేసు లీకులపై కాకుండా, ప్రారంభ దశలో జరిగిన న్యాయపరమైన పొరపాట్లపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ సాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..