
కరీంనగర్, వెలుగు: నగరంలో కొత్తగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న బిల్డర్లకు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాణానికి సంబంధించిన సీనరేజ్ ఫీజుల చెల్లింపులు, మున్సిపల్ అనుమతులు, మైన్స్ అండ్ జియాలజీ శాఖ ట్రాన్సిట్ పాసులు సమర్పించాలని ఆదేశించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చినట్లయితే సంబంధిత ఫీజుల రశీదులు ఇవ్వాలని సూచించారు.
నిర్మాణ వ్యయం, లేబర్ సెస్ చెల్లింపుల వివరాలు కూడా అందజేయాలని పేర్కొన్నారు. 20 వేల చదరపు అడుగులకు పైబడిన నిర్మాణాలకు పర్యావరణ అనుమతి పత్రం, టీజీ రెరా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సమర్పించాలని కోరారు. మూడు రోజుల్లో పత్రాలు ఇవ్వకపోతే అక్రమ నిర్మాణాలుగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.