Reading Time: 2 minutes
Niloufer From Turkish Royalty To Hyderabad Beloved Philanthropist

Nilufer:నీలోఫర్.. ఈ పేరు వినగానే చాలా మందికి ‘నీలోఫర్ టీ’ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ, ఆ పేరుకు ఉన్న గొప్పతనం గురించి దాదాపు తెలిసి ఉండదు. ఆ పేరు వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. ఆ వ్యక్తి చేసిన సేవలు కూడా. నిజానికి హైదరాబాద్ నగరంలో ‘నీలోఫర్ టీ’ మాత్రమే కాదు.. నీలోఫర్ ఆసుపత్రి కూడా ఉంది. అవును.. మరి ఇంతకీ ఆ ‘నీలోఫర్’ ఎవరనే కదా మీ అనుమానం.. అక్కడే వస్తున్నాం.!

నీలోఫర్.. ఆమె ఒక టర్కిష్ రాజా కుటుంబానికి చెందిన యువరాణి. ఆమెకు సేవా భావం కాస్త ఎక్కవనే చెప్పాలి. నీలోఫర్ పూర్తి పేరు నీలోఫర్ హానిమ్ సుల్తాన్ (Nilufer Hanımsultan). ఆమె 1916 జనవరి 4న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఓట్టోమన్ సామ్రాజ్య కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి అడిలే సుల్తాన్, తండ్రి మొరల్ ఇజాడే సెలాహెద్దీన్ అలీ బే. ఓట్టోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత రాజకుటుంబం ఫ్రాన్స్‌ లోని నీస్‌కు వెళ్లిపోయింది. అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సహాయం అందించేవారు.

1931లో.. 15 సంవత్సరాల వయసులో నీలోఫర్‌ను నిజాం నవాబు రెండవ కుమారుడు మొజ్జామ్ జాహ్కు ఇచ్చి వివాహం చేశారు. హైదరాబాద్ రాజకుటుంబంలోకి వచ్చిన ఈ టర్కిష్ యువరాణి తన అందం, స్టైల్, స్వేచ్ఛావాద స్వభావంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె చీరను పశ్చిమ స్టైల్‌తో ధరించి.. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, హైదరాబాద్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. ప్రజలు ఆమెను “హైదరాబాద్ కోహినూర్” అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఆమె జీవితంలోని మలుపు 1940ల చివరలో వచ్చింది.

నీలోఫర్ సేవకురాలలో ఒకరైన రఫత్ ఉన్నిసా బేగం ప్రసవ సమయంలో సరైన వైద్య సదుపాయాల లోపం వల్ల మరణించింది. ఈ ఘటన నీలోఫర్‌ను లోతుగా కదిలించింది. “ఇక ఎవరూ రఫత్ లాగా మరణించకూడదు” అని అనుకోని ఏకంగా నీలోఫర్ హాస్పిటల్ ను స్థాపించింది. 1949లో మహిళలు, పిల్లల వైద్యం కోసం అప్పుడే 100 పడకల ఆసుపత్రిగా ప్రారంభమై నేడు ఈ ఆసుపత్రి ఇప్పుడు 1200+ బెడ్స్ తో హైదరాబాద్‌ లోని ప్రముఖ మహిళల & పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా ఎదిగింది.

నీలోఫర్ కేవలం ఆసుపత్రి మాత్రమే కాదు.. ఆమె సమాజ సేవ, మహిళల సాధికారత, సాంస్కృతిక మిళితం (తూర్పు-పశ్చిమ సంస్కృతుల మధ్య వారధి)కి ప్రతీక. 1952లో ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన తల్లితండ్రల వద్దకు అంటే టర్కీకి వెళ్లి, ఆ తర్వాత ప్యారిస్ కి వెళ్లారు. అక్కడ కూడా ఆమె సేవా కార్యక్రమాలు కొనసాగించింది. 1989 జూన్ 12న పారిస్‌లో మరణించినా, ఆమె పేరు హైదరాబాద్‌లో ఇప్పటికీ జీవించి ఉంది.