
- రాజీవ్ రహదారిపై ముగ్గురు రిసెప్షన్కు వెళ్లి వస్తుండగా మృతి
- రఘునాథపల్లిలో ఇద్దరు దుర్మరణం
సిద్దిపేట/రఘునాథ్పల్లి, వెలుగు: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మారుతి కారు దుద్దెడ గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న మహిళలను తప్పించబోయి అదుపుతప్పింది.
రోడ్డు పక్కన ఇంటి బయట కూర్చున్న మహిళతో పాటు బాలికను ఢీకొట్టింది. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని గుద్దుకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న ఆరే రాధవ్వ(60), కెమ్మసారం లచ్చవ్వ(65) తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పదేళ్ల బాలికను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే చనిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు మృతి..
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండకు చెందిన మహమ్మద్ రహీముద్దీన్ బంధువులతో కలిసి కర్నాటకలోని గుల్బర్గాలో జరిగిన రిసెప్షన్కు హాజరయ్యారు. తిరిగి వస్తుండగా గోవర్ధనగిరి సమీపంలోని దర్గా ఎదురుగా ఉన్న మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
ఈ ఘటనలో హబీబా ఆఫ్సా(27), మహమ్మద్ అసదుద్దీన్(35)కు తీవ్రగాయాలయ్యాయి. వారిని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.