Reading Time: 2 minutes
Nitish Kumar Reddy Pauses Press Conference For Mothers Call Heartwarming Video Goes Viral

Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తన తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తల్లి ఫోన్‌కు స్పందించిన విధానం అభిమానుల మనసులు గెలుచుకుంది.

ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నితీశ్ రెడ్డికి అతని తల్లి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడుగుతుండగా ఫోన్ చూసిన నితీశ్.. కాల్ లిఫ్ట్ చేశాడు. ‘అమ్మ.. ఐదు నిమిషాల్లో కాల్ చేస్తాను’ అని చెప్పి కాల్ కట్ చేశాడు. అనంతరం మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్పి.. తిరిగి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఈ సరదా సంఘటన అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ‘అమ్మ ఫోన్‌కు ఎప్పుడూ ప్రాధాన్యతే’, ‘అమ్మతో అట్లుంటది మరి’ అంటూ కామెంట్లు చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. యువ ఆటగాడి వినయం, కుటుంబానికి ఇచ్చే గౌరవం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

ఈ మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు కీలక వికెట్లు తీశాడు. అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్‌తో పాటు సీనియర్ మహ్మద్ నబీ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత బౌలింగ్ దాడిలో కీలకంగా మారాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2026లో నితీశ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 13 ఇన్నింగ్స్‌లలో 302 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ కూడా ఉంది . బౌలింగ్‌లో ఎనిమిది వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా తన విలువను నిరూపించాడు. అతని నిలకడైన ప్రదర్శన ఫలితంగానే భారత జట్టులో అవకాశం దక్కింది.