
Road Tax Relief: రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు పర్యావరణ అనుకూల వాహనాల వైపు ప్రజలను ఆకర్షించేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే (EV) కాకుండా, హైబ్రిడ్ కార్లకు కూడా ఊరటనిచ్చేలా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో హైబ్రిడ్ వాహనాల కొనుగోలుపై విధించే పన్నులు, ఇతర రుసుములలో దాదాపు 50 శాతం వరకు మినహాయింపు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.
కొత్త ఈవీ పాలసీ (2026-2030) లోని ప్రధానాంశాలు
ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఈవీ పాలసీ 2026-2030’ ముసాయిదా ప్రకారం.. రూ. 30 లక్షల ధర లోపు ఉండే ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’ కార్లపై 50 శాతం రోడ్ టాక్స్ మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదనపై ప్రస్తుతం విస్తృత చర్చ నడుస్తోంది. దీనిపై జూలై 15 నాటికి తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ కొత్త పాలసీ మొత్తం బడ్జెట్ విలువ రూ. 3,954 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ నీతి కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఆకర్షణీయమైన సబ్సిడీలు, పాత వాహనాల స్క్రాపింగ్ (ధ్వంసం) పై అదనపు ప్రోత్సాహకాలు మరియు కాలుష్యాన్ని తగ్గించడానికి పలు కఠిన నిబంధనలను చేర్చారు. ఈ ప్రతిపాదనల ప్రకారం.. జనవరి 2027 నుండి కొత్త పెట్రోల్, డీజిల్ త్రీ-వీలర్ల (ఆటోల) రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని, అలాగే ఏప్రిల్ 2028 నుండి కొత్త పెట్రోల్ టూ-వీలర్ల రిజిస్ట్రేషన్లపై కూడా పూర్తి నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వంలోని ఒక వర్గం కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే ప్రోత్సహించే ‘ఫుల్ ఈవీ మోడల్’ను సమర్థిస్తుండగా, రవాణా శాఖకు చెందిన మరో వర్గం మాత్రం హైబ్రిడ్ వాహనాలను సమర్థిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సదుపాయాలు) పరిమితంగా ఉన్నాయని, కాబట్టి పూర్తి ఈవీ స్థాయికి చేరుకోవడానికి హైబ్రిడ్ వాహనాలు ఒక ఆచరణాత్మకమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రారంభంలో ఒక రెండేళ్ల పాటు హైబ్రిడ్ వాహనాలకు ఈ రోడ్ టాక్స్ మినహాయింపు ఇచ్చి, ఆ తర్వాత దశలవారీగా దాన్ని తొలగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. బ్రిడ్ కార్లలో పెట్రోల్ ఇంజిన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా, సాధారణ పెట్రోల్-డీజిల్ వాహనాలతో పోలిస్తే కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. పూర్తి ఈవీలను కొనుగోలు చేయడానికి ఛార్జింగ్ సమస్యలు, లాంగ్ డ్రైవ్ వంటి కారణాల వల్ల వెనుకాడే మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు.