Reading Time: < 1 minute
ATM: ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్‌..!

ATM: అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి గుంతకల్లు నిత్యం రద్దీగా ఉండే ట్రావెల్స్ బంగ్లా సర్కిల్ వద్ద ఉన్న ఎస్బిఐ బ్యాంక్ ఎటిఎం మెషిన్ పగలగొట్టి ఎత్తుకెళ్లేందుకు దొంగలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బ్లాక్ కలర్ బొలెరో టెంపో వాహనంలో వచ్చిన ముగ్గురు దుండగులు.. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఎస్బిఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. ఏటీఎం సెంటర్ అద్దాలు పగలగొట్టి మెషిన్ కు తాడు కట్టి బయట బొలెరో వాహనంతో లాక్కెళ్ళేందుకు ప్రయత్నించగా.. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఏటీఎం సెంటర్ కు ఎదురుగా ఉన్న ఇంటి యజమాని నిద్రలేచి చూడగా దొంగలు ఏటీఎం మిషన్ పగలగొట్టి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీంతో సదరు వ్యక్తి గట్టిగా దొంగలు దొంగలు అని కేకలు వేయడంతో దుండగులు ఏటీఎం మెషిన్ వదిలి బొలెరో వాహనంలో పారిపోయారు. ముగ్గురు దుండగులు బొలెరో వాహనంలో వచ్చి ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు సీసీటీవీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఏటీఎం మెషిన్‌లో దాదాపు 30 లక్షల రూపాయలు ఉన్నట్లు, ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి ఫెయిల్ అవడంతో బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండు నెలల క్రితం సరిగ్గా ఇలాగే ధర్మవరంలో కూడా కొంతమంది దుండగులు బొలెరో టెంపో వాహనంలో వచ్చి ఎస్బిఐ ఎటిఎం మెషిన్ ను తాడుతో కట్టి లాక్కెళ్ళి, రాప్తాడు సమీపంలో ఏటీఎం మెషిన్ పగలగొట్టి మెషిన్ అక్కడే వదిలేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో అదే ముఠాకు చెందినవారే గుంతకల్ ఎస్‌బీఐ ఏటీఎం మెషీన్‌ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిసి ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

 

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి