
పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండలకు బయలుదేరే బోట్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విహారయాత్ర కోసం వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.
పాపికొండల యాత్ర కోసం ముందుగానే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులకు పర్యాటక శాఖ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బోటు సర్వీసులు నిలిపివేసిన నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయానికి ఇటీవల జరిగిన ఓ ఘటన ప్రధాన కారణంగా నిలిచింది. ఈ నెల 13న 89 మంది పర్యాటకులతో బయలుదేరిన ‘శ్రీలక్ష్మి’ బోటుకు గోదావరి నదిలో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బోటులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. సమాచారం అందుకున్న కంట్రోల్ రూమ్ అధికారులు వెంటనే స్పందించి ‘జలశ్రీ’ బోటును ఘటనాస్థలికి పంపించారు. అనంతరం పర్యాటకులను సురక్షితంగా మరో బోటులో తరలించారు.