
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఇరాన్ షాకిచ్చింది. 24 గంటల్లో ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగబోతుందని సోషల్ మీడియా వేదికగా షరీఫ్ ప్రకటించారు. దీనికి ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంపై ఆదివారం సంతకం కాదని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన 24 గంటల్లో ఒప్పందం ఖరారవుతుందనే వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ శనివారం మాట్లాడుతూ.. ఆదివారం ఒప్పందం సంతకం కాదని తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేదు. మరో పక్షం నుంచి ఇంకా కొంత సంకోచం ఉన్నందున గడువులపై వ్యాఖ్యానించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
భిన్నంగా ఇరాన్ స్పందన
శనివారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో స్పందిస్తూ.. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం వచ్చే 24 గంటల్లో ఖరారయ్యే అవకాశముందని ప్రకటించారు. ఒప్పందం తుది దశకు చేరుకుందని, ఖరారైన వెంటనే ఎలక్ట్రానిక్ సంతకాల ప్రక్రియ చేపట్టేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందని వెల్లడించారు. “శాంతి ఒప్పందానికి మేము ఎన్నడూ లేనంత దగ్గరగా ఉన్నాం. వచ్చే 24 గంటల్లో తుది రూపు దాల్చే అవకాశం ఉంది. అనంతరం వచ్చే వారం సాంకేతిక స్థాయి చర్చలు జరగనున్నాయి” అని షరీఫ్ పేర్కొన్నారు. అలాగే చర్చల్లో పాల్గొంటున్న అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రాంతీయ శాంతికి బలమైన పునాది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా, ఇరాన్ ప్రతినిధులు శాంతి ఒప్పందానికి సంబంధించిన తుది పాఠ్యంపై అంగీకారానికి వచ్చారని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ప్రకటించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ కూడా ఇటీవల చర్చలు గణనీయంగా ముందుకు వెళ్లినట్లు సంకేతాలు ఇచ్చారు. “ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం ఇప్పటివరకు ఎన్నడూ లేనంత దగ్గరగా ఉంది. తుది నిర్ణయం వెలువడే వరకు మీడియా ఊహాగానాలకు దూరంగా ఉండాలి” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఒప్పందంలోని అంశాలపై వస్తున్న వార్తలపై ముందస్తు అంచనాలు వేయవద్దని సూచించారు. తుది ఒప్పందం ఖరారైన తర్వాత పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.
తుది దశలో చర్చలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ చర్చలు ఏప్రిల్ నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణను మరింత కాలం కొనసాగించడంతో పాటు ఆంక్షలు, హార్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్ అణు కార్యక్రమం వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలకు మార్గం సుగమం చేయనున్నాయి. ఇప్పటికైతే పాకిస్థాన్ ప్రకటించిన 24 గంటల గడువుకు ఇరాన్ బ్రేక్ వేసినప్పటికీ.. ఇరు దేశాలు ఒప్పందానికి గతంలో ఎన్నడూ లేనంతగా దగ్గరగా వచ్చాయని తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి.
We are closer to a peace deal than ever before. With finalisation likely expected in the next 24 hours, Pakistan is preparing for the electronic signing of the peace deal immediately after, followed by technical level talks next week.
We would like to thank United States of…
— Shehbaz Sharif (@CMShehbaz) June 13, 2026