
‘కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డ.. కళ్లముందే ఆడుకుంటూ కనిపించకుండా పోతే ఆ కన్నప్రేమ పడే ఆరాటం వర్ణనాతీతం! అవును.. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలోని సీహెచ్ అగ్రహారంలో గుండెల్ని పిండేసే విషాదం నీడలు అలుముకున్నాయి. రెండేళ్ల పసికందు, బుడిబుడి అడుగుల చిన్నారి జ్ఞానేశ్వరి.. జూన్ 6వ తేదీ శనివారం నాడు అకస్మాత్తుగా మాయమైపోయింది. కాలం గడుస్తోంది.. గడియారంలో ముల్లు కదులుతోంది.. కానీ ఆ పసిపాప జాడ మాత్రం దొరకడం లేదు. తల్లి కళ్లల్లో కన్నీటి సుడిగుండం.. తండ్రి గుండెల్లో ఆవేదనల సముద్రం. అసలు ఆ పసిప్రాణం ఎక్కడుంది? ఎవరు తీసుకెళ్లారు? ఏమైపోయింది నా బిడ్డ అంటూ ఆ తల్లి పెడుతున్న రోదనలు అడవిని సైతం కరిగిస్తున్నాయి!”
ఏం జరిగింది..?
కథల వెనుక అంతుచిక్కని నిజాలు..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు నుంచి సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా ఎన్నో కథనాలు, ఎన్నెన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో ప్రతి మలుపూ ఒక సినిమా స్టిల్ లాగా, నమ్మశక్యం కాని మిస్టరీలా మారుతోంది. ఆ చిన్నారితో పాటే మాయమైన వారి పెంపుడు కుక్క ఈ కథలో ఒక కీలక పాత్ర పోషించింది.
విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మూగజీవి..
తప్పిపోయిన మూడు రోజుల తర్వాత.. ఆ పెంపుడు కుక్క అకస్మాత్తుగా తోటలోని మకాం వద్దకు తిరిగి వచ్చింది. అక్కడ వందలాది మంది పోలీసులు, ఏడుస్తున్న కుటుంబ సభ్యులను చూసి భయంతో మళ్లీ పారిపోయింది. చివరికి, ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు యువకులు చాకచక్యంగా ఆ కుక్కను పట్టుకున్నారు. ఇక్కడే అసలైన సెంటిమెంట్ సీన్ మొదలైంది! ఆ మూగజీవి నేరుగా చిన్నారి తల్లి దగ్గరకు వెళ్లి, ఆమె కొంగు పట్టుకుని గట్టిగా లాగడం ప్రారంభించింది. నోరు లేని ఆ జీవి, తన చిన్నారి యజమానురాలు ఎక్కడుందో చూపించడానికి అడవి వైపు పరుగు తీసింది.
ఆశలు రేపి.. అచేతనంగా మారిన క్లూ..
పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కుక్క మెడకు జీపీఎస్ ట్రాకర్ను అమర్చారు. అది అడవి దారుల్లో, పొలాల గట్ల వెంబడి దాదాపు 80 నిమిషాల పాటు, 8 కిలోమీటర్ల మేర పరుగులు తీసింది. బహుశా ఆ పాప కోసం గాలించి గాలించి అలసిపోయిందేమో.. చివరికి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. చిన్నారి తప్పిపోయినప్పటి నుంచి అన్నం, నీళ్లు లేకపోవడం వల్లే అది మృతి చెందిందని భావిస్తున్నారు. ప్రాణం పోయే క్షణంలోనూ ఆ విశ్వాసంగల మూగజీవి పాప ఆచూకీ కోసం తపించింది. కానీ, ఆ కుక్క చనిపోవడంతో పోలీసులకు ఉన్న ఒకే ఒక్క పెద్ద ఆధారం చేజారిపోయింది.
పోలీసుల గాలింపు..
ప్రస్తుతం 500 ఎకరాల దట్టమైన అటవీ ప్రాంతంలో వందలాది మంది పోలీసులు, రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నారు. అయితే, వారం గడుస్తున్నా పాప దొరకకపోవడంతో ఇది కేవలం తప్పిపోవడం కాదని, ఎవరైనా క్రూరులు ఆ పసిగుడ్డును కిడ్నాప్ చేసి ఉంటారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ అడవి దారి గుండా చిన్నారిని ఎక్కడికైనా తరలించారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
“చిన్నారి జ్ఞానేశ్వరి నవ్వులు లేక ఆ ఇల్లు చీకటిగా మారింది. అమ్మా.. నాన్నా.. అని పిలిచే ఆ ముద్దులొలికే గొంతు ఎక్కడో అడవిలోనో, లేక ఏ అపరిచితుల మధ్యనో సాయం కోసం రోదిస్తూ ఉండి ఉండవచ్చు. ఆ పసిపాప క్షేమంగా తిరిగి రావాలని, కన్నవారి ఒడికి చేరాలని కోరుకుందాం. దేవుడా.. ఆ తల్లి కడుపు కోతను చల్లార్చు.. ఆ చిన్నారిని సురక్షితంగా ఇంటికి చేర్చు”