Reading Time: 2 minutes
Why Global Fertility Rates Are Falling Rapidly Explained

Fertility Rate in World Declined: ఒకప్పుడు గంపెడు సంతానం.. ఆతర్వాత మేమిద్దం- మాకిద్దరు రోజులు… కానీ ఇప్పుడు.. పిల్లల్ని కనడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు నేటి జనరేషన్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనో… ఇండియాలోనో ఉన్న సమస్య కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. మెజార్టీ ప్రపంచ జనాభా ‘నో కిడ్స్ పాలసీ’ని ఫాలో అవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల దాకా… పేద-ధనిక అన్న తేడా లేకుండా ప్రజలు పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోతోంది. ఇంతకీ జనం పిల్లల్ని ఎందుకు వద్దనకుంటున్నారు?

టోటల్ ఫెర్టిలిటీ రేటు ఎందుకు పడిపోతోంది?

ఒకప్పుడు ఇంట్లో పిల్లల సందడి ఉంటేనే ఆనందం అనుకునేవారు. రానురాను ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు.. అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనూహ్యంగా పడిపోతోంది. 1960వ దశకం ప్రారంభంలో సగటున ఒక మహిళకు ఐదుగురు పిల్లలు ఉంటే.. 2024 నాటికి ఆ సంఖ్య రెండుకు పడిపోయింది. భారతదేశంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు ఆరుకు దగ్గరగా ఉన్న సంతానోత్పత్తి రేటు ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే దిగువకు చేరింది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఇది కనీసం 2.1గా ఉండాలి. సౌత్ కొరియా లాంటి దేశాల్లో అయితే ఈ రేటు అత్యంత కనిష్టంగా పాయింట్ ఏడుగా నమోదవుతోంది.

కెరీర్‌ ఫస్ట్.. కిడ్స్ నెక్ట్స్:

అసలు జనం పిల్లల్ని కనడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో విశ్లేషిస్తే అనేక కారణాలు కనిపిస్తాయి. ప్రధానంగా పెరుగుతున్న జీవన వ్యయం, పట్టణీకరణ.. ప్రజల నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లల పెంపకం, ఉన్నత చదువుల కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి రావడం పెద్ద అడ్డంకిగా మారింది. మహిళల్లో పెరుగుతున్న విద్యాస్థాయి, ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం పెరగడం మరో ప్రధాన కారణం. కెరీర్‌లో స్థిరపడే క్రమంలో చాలామంది పిల్లల్ని వద్దనుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా ఇంటి పనుల భారం మొత్తం మహిళలే మోయాల్సి రావడం కూడా వారు తక్కువ మంది పిల్లల వైపు మొగ్గుచూపేలా చేస్తోంది.

కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా సామాజిక మార్పులు కూడా ఈ పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయి. ఆధునిక సమాజంలో పెళ్లిళ్ల రేటు తగ్గిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒంటరిగా జీవించే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. టెక్నాలజీ.. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడం వల్ల మనుషుల మధ్య ముఖాముఖి సంబంధాలు బాగా తగ్గిపోయాయి. కుటుంబ బాధ్యతల కన్నా వ్యక్తిగత ఆశయాలు…స్వేచ్ఛకు నేటి యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి తోడు వాతావరణ మార్పుల పట్ల పెరుగుతున్న ఆందోళనలు కూడా భవిష్యత్తు తరాలకు జన్మనివ్వాలా వద్దా అనే నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఈ పరిణామాల వల్ల భవిష్యత్తులో సమాజం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత మంది పిల్లలు పుట్టకపోతే రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి.. పనిచేసే యువత సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల వృద్ధులకు పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ కల్పించడం ప్రభుత్వాలకు కష్టంగా మారుతుంది. తక్కువ సంఖ్యలో ఉన్న వర్కింగ్ పాపులేషన్‌పై పన్నుల భారం విపరీతంగా పెరుగుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా విధానాలు రూపొందిస్తున్నాయి. మూడో పిల్లకు ఆర్థిక సాయం, ఐవీఎఫ్‌కు మద్దతు లాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.