Reading Time: 2 minutes
ICC Player of the Month : ఐసీసీ అవార్డుల్లో భారత్, పాక్ జోరు.. ఫర్హాన్, అరుంధతి రెడ్డిలదే హవా

ICC Player of the Month : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించింది. ఈసారి భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు చెరో అవార్డును దక్కించుకోవడం విశేషం. పురుషుల విభాగంలో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్, మహిళల విభాగంలో భారత పేసర్ అరుంధతి రెడ్డి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసినందుకు ఫర్హాన్ కు ఈ గౌరవం దక్కింది.

సాహిబ్‌జాదా ఫర్హాన్

పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ టీ20 వరల్డ్ కప్ 2026లో మునుపెన్నడూ లేని విధంగా చెలరేగిపోయాడు. పాకిస్థాన్ జట్టు సూపర్-8 దశలోనే నిష్క్రమించినప్పటికీ, ఫర్హాన్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే 76.6 సగటుతో 383 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు అద్భుతమైన సెంచరీలు ఉండటం గమనార్హం. 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడు, టోర్నీలో ఏకంగా 18 సిక్సర్లు, 37 ఫోర్లతో స్టేడియాలను హోరెత్తించాడు. ఈ నిలకడైన ప్రదర్శనే అతడిని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలబెట్టింది.

అరుంధతి రెడ్డి

మహిళల క్రికెట్‌లో భారత పేసర్ అరుంధతి రెడ్డి ఫిబ్రవరి నెలలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌లో అరుంధతి తన స్వింగ్ బౌలింగ్‌తో కంగారూ బ్యాటర్లను కట్టడి చేసింది. మూడు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 8 వికెట్లు పడగొట్టి సిరీస్ విజయానికి కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ప్రదర్శన ఇచ్చింది. కాన్బెర్రా, అడిలైడ్ మ్యాచ్‌ల్లో కూడా చెరో రెండు వికెట్లు తీసి తన సత్తా చాటింది. అందుకే ఐసీసీ ఆమెను ఫిబ్రవరి నెలకు గాను ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఎంపిక చేసింది.

ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో భారత్ హవా

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల చరిత్రను చూస్తే టీమిండియా ఆటగాళ్లదే పైచేయిగా ఉంది. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు అత్యధికంగా నాలుగు సార్లు (జనవరి 2023, సెప్టెంబర్ 2023, ఫిబ్రవరి 2025, జూలై 2025) ఈ అవార్డును గెలుచుకుని రికార్డు సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ కూడా రెండేసి సార్లు ఈ ఘనత సాధించారు. ఇక పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజం మూడు సార్లు ఈ అవార్డు దక్కించుకోగా, ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, లంక ప్లేయర్ కామిందు మెండిస్ రెండేసి సార్లు విజేతలుగా నిలిచారు. తాజాగా అరుంధతి రెడ్డి ఈ జాబితాలో చేరడం భారత మహిళల క్రికెట్‌కు శుభపరిణామం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..