Reading Time: < 1 minute
Jc Prabhakar Reddy Emotional At Tadipatri Municipal Meeting Vision For 2027

JC Prabhakar Reddy Emotional: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి అభివృద్ధిపై తనకు స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. “2027 నాటికి ప్రపంచ పటంలో తాడిపత్రి పేరు కనిపించేలా అభివృద్ధి చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

Read Also: India Post: తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం.. 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్!

త్వరలో నిర్మాణం పూర్తి కానున్న షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత పొందుతుందని తెలిపారు జేసీ.. ఆ ప్రాంతం భవిష్యత్తులో “బెంజి సర్కిల్” కాదని, “తాడిపత్రి సర్కిల్”గా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రికి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలతో మాట్లాడిన ఆయన, తాను తప్పు చేస్తే చెప్పాలని, తప్పులను సరిదిద్దుకుంటామని అన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను కౌన్సిలర్లుగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. “డబ్బులు కావాలంటే మీకు నచ్చిన వారిని గెలిపించండి. అభివృద్ధి కావాలంటే పనిచేసే వారిని గెలిపించండి. దౌర్జన్యాలు, కబ్జాలు కావాలంటే మీకు నచ్చిన వారిని గెలిపించండి. అభివృద్ధి కావాలంటే జేసీ కుటుంబం నిలబెట్టిన వారిని గెలిపించండి” అని ఆయన వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడిన ఈ ప్రసంగం ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.