Reading Time: < 1 minute
Tarique Rahman India Visit Bangladesh Divide Over India Relations Sheikh Hasina Extradition

Bangladesh: వస్తే ఓ బాధ, రాకుంటే ఓ బాధ అన్నట్లు తయారైంది బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మన్ పరిస్థితి. భారత్ పర్యటనపై బంగ్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను అప్పగించిన తర్వాతే భారత్‌తో సంబంధాలు పెట్టుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, మరికొందరు బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధితో పాటు నదీ జలాల అంశాలు భారత్‌తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. ఆగస్టు మూడో వారంలో, బ్రిక్స్ సదస్సుకు ముందు ఆయన భారత్‌కు వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన పర్యటనపై అధికారిక సమాచారం లేదు.

హసీనాను భారత్ నుంచి అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతోంది. తారిఖ్ రెహ్మాన్ పర్యటనకు రావాలంటే షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ షరతు విధిస్తోంది. ఇక నేషనల్ సిటిజన్స్ పార్టీ (NCP) వ్యవస్థాపక కన్వీనర్, హసీనాను అధికారంలో నుంచి తొలగించిన విద్యార్థి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాహిద్ ఇస్లాం షేక్ హసీనాను అప్పగించే వరకు భారత్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకోవద్దని చెబుతున్నాడు. మరోవైపు, భారత విధానంపై బంగ్లాదేశ్ ప్రభుత్వంలోనే విభేదాలు కనిపిస్తున్నాయి. కొందరు హసీనాను అప్పగిస్తేనే భారత్‌తో సంబంధాలు అని చెబుతుంటే, మరికొందరు మాత్రం భారత్‌తో ఆచరణాత్మక సంబంధాలు అవసరమని భావిస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనపై కఠిన వైఖరికి కేవలం విదేశాంగ విధానొం కారణంగా కాదని, దేశంలోని రాజకీయ లెక్కలు కూడా కారణమని చెబుతున్నారు. భారత్‌తో కఠినంగా వ్యవహరించడం ద్వారా భారత్‌కు బంగ్లాదేశ్ తలొగ్గదని నిరూపించుకోవాలని రెహ్మాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విధానం ఎక్కువ కాలం కొనసాగితే బంగ్లాదేశ్‌కు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.