Reading Time: < 1 minute
Vishwanath And Sons Enters Rs 200 Crore Club Suriya Box Office Rampage

Vishwanath and Sons: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం జోరు కొనసాగిస్తోంది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో ఆదరిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రతి ఎమోషన్‌ను వెండి తెరపై కుటుంబాలతో కలిసి సెలబ్రేట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. రూ.200 కోట్ల మార్క్‌ను దాటినప్పటికీ సినిమా జోరు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది.

ఇదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథ

ఈ సినిమాలో సూర్య సంజయ్ విశ్వనాథ్ పాత్రలో కనిపించారు. బిజీ బిజినెస్‌మ్యాన్ అయిన సంజయ్ చిన్నప్పటి కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. అయితే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి తల్లి రాధిక కోరికల్లో ఒకదాన్ని నెరవేర్చినప్పటికీ.. తన పెళ్లి విషయంలో మాత్రం ఆమెను నిరాశపరుస్తుంటాడు. తన వంశం ఇక్కడితో ఆగిపోతుందనే బాధ తల్లిలో ఉందని తెలుసుకున్న సంజయ్.. సరోగసీ ద్వారా ఓ బిడ్డకు తండ్రి అవుతాడు. అయితే ఆ చిన్నారికి అరుదైన బోన్ మ్యారో వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది. చికిత్స కోసం బోన్ మ్యారో డోనర్‌గా తల్లి అవసరమని తెలుసుకున్న సంజయ్.. ఆమె కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి మ్యాడీ (మమితా బైజు) పరిచయమవుతుంది. ఆమెను వెంటబెట్టుకుని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత సంజయ్ జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలే సినిమా ప్రధాన కథాంశంగా నిలుస్తాయి. సూర్య నటన, వెంకీ అట్లూరి కథనం, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్స్‌లో సూపర్ సక్సెస్‌ అందుకుంది. రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన ఈ చిత్రం లాంగ్‌రన్‌లో మరిన్ని రికార్డులు సాధించే దిశగా దూసుకెళ్తోంది.