July 8, 2026

Surya Kumar Yadav: ‘ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు’.. సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం..

Surya Kumar Yadav: ‘ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు’.. సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం..
Reading Time: 2 minutes
Suryakumar Yadav Denies Fake Viral Statements On T20 Captaincy

భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ఆయన సారథ్యంలోనే భారత్ 2026 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఆ తర్వాత సెలక్టర్లు సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించి, శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన భారత టీ20 జట్టులో లేనప్పటికీ, జట్టుపై తనకున్న ప్రేమను చాటుకుంటూ.. తన పేరుతో వైరల్ అవుతున్న నకిలీ ప్రకటనలను నమ్మవద్దని అభిమానులను కోరారు.

నకిలీ ప్రకటనలపై సూర్య స్పందన..
తన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక ప్రకటన పూర్తిగా అవాస్తవమని సూర్యకుమార్ యాదవ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు. “ఆన్‌లైన్‌లో నా పేరుతో ఒక ప్రకటన షేర్ అవుతున్నట్లు నా దృష్టికి వచ్చింది, అది పూర్తిగా తప్పు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దయచేసి ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని నమ్మకండి, షేర్ చేయకండి. భారత క్రికెట్, నా సహచర ఆటగాళ్లకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది” అని సూర్య పేర్కొన్నారు. ప్రస్తుత జట్టు ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారని, వారికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.

వైరల్ అయిన ఆ తప్పుడు పోస్ట్ ఏమిటి?
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా సూర్యకుమార్‌కు జట్టులో స్థానం కల్పించకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజీలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. “ప్రపంచకప్ గెలిచిన తర్వాత నేనే కెప్టెన్‌గా ఉంటానని సెలక్టర్లు చెప్పారు. కానీ చివరి నిమిషంలో జట్టులో నా పేరు లేదని తెలిసింది. కనీసం నాకు భవిష్యత్తు గురించి స్పష్టత ఇవ్వలేదు. నేను ఆశించిన గౌరవం దక్కలేదు” అని సూర్య అన్నట్లు ఒక ఫేక్ స్టేట్‌మెంట్ విపరీతంగా వైరల్ అయింది. దీనిని సూర్య పూర్తిగా ఖండించారు.

వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక అభినందనలు..
ఇదే పోస్ట్‌లో సూర్యకుమార్ యాదవ్ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్.. భారత్ తరఫున అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వైభవ్ కెరీర్ అద్భుతంగా సాగాలని, దేశం గర్వించేలా రాణించాలని సూర్య ఆకాంక్షించారు.

టీమిండియా ప్రస్తుత పరిస్థితి..
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించలేకపోయింది. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ భారత్ క్లీన్‌స్వీప్‌కు గురైన విషయం తెలిసిందే.