July 7, 2026

Pakistan: భారత్‌పై పగతో పెంచిన పామే ఇప్పుడు పాకిస్థాన్‌ను మింగేస్తుంది! వారంలోనే 50 మంది పాక్ సైనికులు ఖతం..

Pakistan: భారత్‌పై పగతో పెంచిన పామే ఇప్పుడు పాకిస్థాన్‌ను మింగేస్తుంది! వారంలోనే 50 మంది పాక్ సైనికులు ఖతం..
Reading Time: 2 minutes
Terror Monster Bites Back Pakistan Over 50 Soldiers Killed In Deadly Attacks Week

Pakistan: ఒకప్పుడు భారత్‌పై తీవ్రమైన పగతో ఎలాగైనా మన దేశాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని పాముకు పాలు పోసి పెంచినట్లు పాకిస్థాన్ ఉగ్రవాదం అనే పెను భూతాన్ని చేరదీసి పెంచింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే పాకిస్థాన్‌ను ఉగ్రవాదం కోరలు చాచి మింగేస్తోంది. అందుకే పెద్దలు ఎప్పుడు చెబుతుంటారు.. కర్మ అనేది ఒకటి ఉంది.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరనేది నిజం అనే వాళ్ల మాటలు పాక్ పరిస్థితిని చూస్తే అక్షరాల వాస్తవం అని అర్థం అవుతుంది. గత వారం రోజులుగా ఆ దేశంలో భద్రతా దళాలే లక్ష్యంగా జరిగిన వరుస దాడులు అక్కడి రక్షణ వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేశాయి. జూలై 1 నుంచి జూలై 7 మధ్య కేవలం ఏడు రోజుల్లోనే వివిధ ప్రావిన్సులలో జరిగిన చిన్న, పెద్ద దాడుల్లో 50 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టిస్తోంది. మిలిటరీ స్థావరాలు, పోలీస్ పోస్టులు, కోస్ట్ గార్డ్ క్యాంపులపై ఉగ్రవాదులు తెగబడి దాడులు చేయడంతో పాక్ ప్రభుత్వం, సైన్యం వణికిపోతున్నాయి. ఇదే సమయంలో ఆ దేశ సైనిక అధికారులు అనుసరిస్తున్న వ్యూహాలపై కూడా తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వారం రోజుల్లో జరిగిన భయానక దాడులు ఇవే..

* జూలై 1 (ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా): కోహట్-హంగూ రహదారిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు.

* జూలై 2 (బజౌర్ & మహమ్మద్ జిల్లా): బజౌర్ ప్రాంతంలో ఒక ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) సైనికుడు, అలాగే మహమ్మద్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

* జూలై 3 (గ్వాదర్ పోర్ట్ – భారీ ఆత్మాహుతి దాడి): బలూచిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్ సమీపంలో ఉన్న పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ క్యాంపుపై బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) అత్యంత ఘోరమైన ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును నేరుగా క్యాంపులోకి దూకించి పేల్చివేయడంతో.. 30 మంది కోస్ట్ గార్డ్ సిబ్బంది అక్కడికక్కడే మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

* జూలై 5 (ఇస్లామాబాద్ – సర్జికల్ స్ట్రైక్): సాక్షాత్తూ రాజధాని ఇస్లామాబాద్‌లోనే ఉగ్రవాదులు సర్జికల్ స్ట్రైక్‌కు పాల్పడ్డారు. ఈ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి (PAF) చెందిన గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతమవ్వడం అక్కడి రక్షణ లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) అధికారికంగా ప్రకటించింది.

* జూలై 7 (బలూచిస్థాన్): జియారత్ జిల్లాలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా దాడిలో 16 మంది పోలీసులు మరణించారు.

ఉగ్ర నీడలో పాక్ భద్రత..

భద్రతా దళాలపై వరుసగా జరుగుతున్న ఈ దాడులు పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు ఎంత దారుణంగా క్షీణించాయో స్పష్టం చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో 2024 ఏడాదిలోనే పాకిస్థాన్‌లో రికార్డు స్థాయిలో 1,099 ఉగ్రవాద దాడులు నమోదు కాగా.. ప్రస్తుత 2025-2026 నాటికి ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరిగిపోతోందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. నాడు ఇతర దేశాలను దెబ్బతీయడానికి పెంచి పోషించిన ఉగ్రవాద భస్మాసురుడే.. నేడు సొంత సైన్యాన్ని కాటేస్తూ పాకిస్తాన్‌ను సర్వనాశనం చేస్తున్నాడని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.