
Donald Trump: ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని తేహ్రాన్ వీధులు కోట్లాది మంది జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మంది ప్రజలు తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. అయితే ఖమేనీ అంత్యక్రియలకు ఈ స్థాయిలో జనం తరలిరావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆశ్చర్యం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారనుకున్నా: ట్రంప్
తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తేహ్రాన్ పరిణామాలపై స్పందించారు. “నేను తేహ్రాన్లో జరుగుతున్న అంత్యక్రియలను నిశితంగా గమనిస్తున్నాను. అక్కడ ఉప్పెనలా తరలివచ్చిన జనసమూహాన్ని చూసి నేను షాకయ్యాను. ఇరాన్లో ఖమేనీకి ఇంత ప్రజాదరణ ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. అక్కడి ప్రజలు ఖమేనీని తీవ్రంగా ద్వేషిస్తారని నేను భావించాను, కానీ లక్షలాది మంది రోడ్లపైకి రావడం నన్ను ఆశ్చర్యపరిచింది” అని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, అంత్యక్రియల్లో ప్రజలు దుఃఖంతో ఏడవడంపై వ్యాఖ్యానిస్తూ.. ఆ కన్నీళ్లు బహుశా నకిలీవి (ఆర్టిఫిషియల్) అయి ఉండొచ్చంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒప్పందం కోసం ఇరాన్ వేడుకుంటోంది..
ఇదే సమయంలో ఇరాన్ దౌత్యపరంగా ఒత్తిడిలో ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు ఇరాన్ ఆరాటపడుతోందని, ఒక ఒప్పందం కోసం వారు వేడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఇరుపక్షాల మధ్య ఎలాంటి దాడులు జరగవని, చర్చలను తాత్కాలికంగా నిలిపివేయడానికి అంగీకారం కుదిరిందని తెలిపారు. అలాగే ఇరాన్ ఉన్నతాధికారులందరూ ఒకే చోట చేరడంపై ట్రంప్ స్పందిస్తూ.. “ఇరాన్ టాప్ లీడర్స్ అందరూ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అమెరికా అనుకుంటే వారందరినీ ఒక్క తూటాతో (ఒక్క బుల్లెట్తో) ఖతం చేయగలదు. కానీ మేం అలా చేయబోవడం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో చర్చలు జరపాలంటే వారి నాయకత్వం మాకు అవసరం. అందరినీ చంపేస్తే మాట్లాడటానికి మాకు ఎవరూ మిగలరు” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
మరోవైపు తేహ్రాన్లో ఖమేనీ అంత్యక్రియల వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్ల దుస్తులు ధరించిన లక్షలాది మంది ఇరాన్ పౌరులు “అమెరికాకు మరణం”, “ఇజ్రాయెల్కు మరణం” అంటూ ఆక్రోశంతో నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయాలంటూ పోస్టర్లను ప్రదర్శించారు. “ప్రతీకారమే మా ఏకైక మాట” అంటూ మార్మోగిన నినాదాలతో తేహ్రాన్ వీధులు రగిలిపోయాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడులకు పక్కాగా ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ మిలిటరీ అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఖమేనీ భౌతికకాయంతో పాటు దాడిలో మరణించిన మరికొందరు కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రెండు మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలకు సుమారు 1.5 కోట్ల మంది హాజరుకావచ్చని ఇరాన్ ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం అక్కడ తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు.
అయితే, ఈ మహోత్తర అంత్యక్రియల వేడుకకు ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడు, ఖమేనీ కుమారుడైన మొజ్తబా ఖమేనీ హాజరుకాకపోవడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఫిబ్రవరిలో ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన బయట ప్రపంచానికి కనిపించడం లేదు. తన తల్లిదండ్రులు, భార్యను బలిగొన్న ఇజ్రాయెల్ దాడిలోనే మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన కేవలం లిఖితపూర్వక ప్రకటనలకే పరిమితమయ్యారని సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం ఆయనను కూడా టార్గెట్ చేసి అంతమొందిస్తుందనే భయంతో, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఆయనను అంత్యక్రియల బహిరంగ కార్యక్రమాలకు హాజరుకాకుండా నిరోధించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.