
Kandula Durgesh: సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ‘జస్ట్ ఆస్కింగ్’ (Just Asking) అంటూ గొంతు చించుకునే ప్రకాష్ రాజ్కు, బూతులు తిట్టే జోసెఫ్ రావణ్కు మధ్య అపవిత్ర, అక్రమ సంబంధం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి, చీకటి ఒప్పందాలకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. జోసెఫ్ రావణ్ ప్రమేయం, సూచనలతోనే ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటాడని.. రావణ్ ప్రశ్నించమంటూ లైన్లోకి రాగానే, ప్రకాష్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ తెరపైకి వస్తాడని మండిపడ్డారు. “నా లింక్ లు ఓపెన్ చేస్తే.. మీకు అసలు మ్యాటర్ అర్థమవుతుంది” అంటూ ప్రకాష్ రాజ్, రావణ్ మాట్లాడుకున్న ఆడియో కాల్ కూడా ఇప్పుడు బయటకు వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్నారని కందుల దుర్గేష్ ఆరోపించారు. తెర ముందు ప్రకాష్ రాజ్, రావణ్ కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక ఉండి వీరిని నడిపిస్తున్నది ఎవరో తేలాల్సి ఉందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే ఈ కుట్రలన్నీ సాగుతున్నాయని, అక్కడి నుంచే వీరికి షెల్ కంపెనీల ద్వారా భారీగా డబ్బులు అందుతున్నాయని ఆరోపించారు. ప్యాలెస్ నుంచి వచ్చే డబ్బు కోసమే, ఈ రాష్ట్రంతో ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రకాష్ రాజ్ ఇక్కడ మాట్లాడుతున్నాడని విమర్శించారు. వీరు కేవలం డబ్బు కోసమే కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, మత ఘర్షణల మంటల్లో చలి కాచుకునే నైజం వీరిదని దుయ్యబట్టారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-24 మధ్య) జరిగిన ఎన్నో అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రకాష్ రాజ్ ఎందుకు నోరు మెదపలేదని మంత్రి కందుల దుర్గేష్ నిలదీశారు. ఆ ఐదేళ్ల కాలంలో ఒక్క అంశం పైన అయినా ‘జస్ట్ ఆస్కింగ్’ అని ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాడీని డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ, డాక్టర్ సుధాకర్ దారుణ మరణం సమయంలో కానీ ప్రకాష్ రాజ్కు ‘జస్ట్ ఆస్కింగ్’ అని ప్రశ్నించడం ఎందుకు గుర్తుకురాలేదని కడిగిపారేశారు. ప్రకాష్ రాజ్, రావణ్ ఇద్దరూ సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టించే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారయ్యారని, వీరి కుట్రలను పోలీసులు అణచివేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ను ఒక కుల చట్రంలో బంధించి, ఆయన ప్రతిష్టను మసకబార్చడమే వీరి ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రశ్నించడం అంటే బండ బూతులు తిట్టడమా, లేక ఒకరి వ్యక్తిగత జీవితాలపై నీచమైన విమర్శలు చేయడమా అని అడిగారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లను అసభ్యంగా దూషించే సంస్కృతిని పెంచి పోషించింది వైసీపీ నేతలేనని, ఇప్పుడు రావణ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏనాడూ అటువంటి సంస్కారహీనమైన భాషను వాడలేదని.. ఆరోజు జగన్, ఆయన మంత్రులు పవన్ను వ్యక్తిగతంగా అంతగా దూషిస్తే, సహించలేకనే తానూ అదే విధంగా స్పందిస్తానని పవన్ మాట్లాడాల్సి వచ్చిందని సమర్థించారు. ప్రకాష్ రాజ్కు జాతీయ వాదం అన్నా, హిందూ వాదం అన్నా అస్సలు నచ్చదని, అందుకే విద్వేషాలు రేపుతున్నాడని దుర్గేష్ విమర్శించారు. సినిమా రంగంలో కూడా అతని ప్రవర్తన, క్యారెక్టర్ సరిగ్గా లేకపోవడం వల్లే అందరూ దూరం పెట్టారని వ్యాఖ్యానించారు.